ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ కష్టాలు... బంకుల వద్ద కిలో మీటర్ల మేర లైన్లు  

ఆటో డ్రైవర్లకు ఎల్పీజీ కష్టాలు... బంకుల వద్ద కిలో మీటర్ల మేర లైన్లు  
  • కొన్ని చోట్ల మూత పడ్డ బంకులు
  • ఐదు రోజులుగా ఇదే పరిస్థితి

హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​పరిధిలో ఎల్పీజీ కొరత తీవ్రరూపం దాలుస్తోంది. సిటీల్లోని చాలా బంకుల్లో ఇప్పటికి ఎల్పీజీ నిల్వలు లేక మూసి వేస్తుండడంతో ఎక్కడో దొరకుతుందో అక్కడికి వాహనదారులంతా క్యూ కడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉంటున్నారు. ఒక్కసారి ఎల్పీజీ ఫుల్​చేస్తే వచ్చే గిరాకీలను బట్టి తొందరగానే అయిపోతోంది. దీంతో మళ్లీ బంకుల బాట పట్టాల్సి వస్తున్నది. అయితే, అక్కడ అప్పటికే ఎల్పీజీ కోసం కిలోమీటర్ల మేర లైన్లు ఉంటుండడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. 

క్యాష్​ చేస్కుంటున్నరు

కొందరు ఎల్పీజీ కొరతను క్యాష్​చేస్కుంటుండడంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. కిలో ఎల్పీజీ బంకుల్లో రూ. 67.95 తీసుకోవాల్సి ఉండగా, దొరికే చోట డబుల్​ఛార్జీలు తీసుకుంటున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అలాగే, కొందరు డొమెస్టిక్​సిలిండర్ల నుంచి గ్యాస్​ను కిలో రూ.500 నుంచి రూ.700కు అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. 

ఇట్లయితే కష్టమే..

ఎల్పీజీ కొరత ఇలాగే కొనసాగితే ఎల్పీజీ బంకుల మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవైపు అధికారులు ఎల్పీజీ కొరత లేదని చెప్తున్నా..కంపెనీలకు అడ్వాన్సుడ్​డబ్బులు చెల్లించకపోవడంతో గ్యాస్​పంపించడం లేదని తెలుస్తోంది.

గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు:కలెక్టర్ హరి చందన దాసరి

హైదరాబాద్ సిటీ , వెలుగు: జిల్లాలో గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి హెచ్చరించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. 

ఇప్పటికే జిల్లాలో 435 కేసులు నమోదు చేసి, 800 సిలిండర్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటి అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా నిరంతరాయంగా జరుగుతోందని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 7416687878 సంప్రదించాలని సూచించారు.