న్యూఢిల్లీ: లాక్డౌన్ టైంలో ఆయుష్మాన్ భారత్ క్లెయిమ్స్ తగ్గాయని లేటెస్ట్ స్టడీలో తేలింది. ముందే నిర్ణయించిన ఆపరేషన్లు వాయిదా పడ్డాయి.. వారానికి సుమారు 51 శాతం క్లెయిమ్స్ తగ్గాయని సైంటిస్టుల టీమ్ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లెయిమ్స్ సంఖ్య బాగా పడిపోయిందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 25 నుంచి జూన్ 2 దాకా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్లెయిమ్స్ లను పరిశీలించాక ఈ విషయాన్ని గుర్తించినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం-జేఏఏ) పథకం అమలు బాధ్యతను ఎన్హెచ్ఏ చూసుకుంటోంది.
ఈ క్రమంలో గడిచిన మూడు నెలల రిపోర్టులను పరిశీలించగా.. ఆస్పత్రుల్లో సర్జరీలు వాయిదా పడ్డట్టు తేలిందని వెల్లడించింది. కాటరాక్ట్, జాయింట్ రీప్లేస్ మెంట్, కార్డియోవాస్కులర్ సర్జరీ.. తదితర ఆపరేషన్లు వాయిదా పడ్డాయని తెలిపింది. సగటున వారానికి 51 శాతం కేసులు తగ్గాయని వివరించింది. లాక్ డౌన్ కు ముందు వారానికి 62 వేల క్లెయిమ్స్ నమోదవుతుండగా.. ఈ నెల మాత్రం ఇది 57 శాతం తగ్గి కేవలం 27,167 క్లెయిమ్స్ మాత్రమే నమోదయ్యాయని ఎన్హెచ్ఏ అధికారులు చెప్పారు.

