యువతి ప్రేమించడం లేదని.. బీ-ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

యువతి ప్రేమించడం లేదని.. బీ-ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
  •  చున్నీతో ఉరి వేసుకున్న నరేశ్​
  •   ఖమ్మం జిల్లాలో విషాదం 

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా రూరల్​మండలంలోని బారుగూడెం పంచాయతీలోని వాయుపుత్ర నగర్ లో ఓ బీ ఫార్మసీ స్టూడెంట్​ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన బల్మూరి నరేశ్​(19) మండలంలోని బారుగూడెంలో మహ్మదీయ ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బారుగూడెంలోని వాయుపుత్రనగర్​లో ఇల్లు రెంట్​కు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఆదివారం రాత్రి అందరూ బిల్డింగ్​ మీద పడుకున్నారు. సోమవారం ఉదయం నరేశ్​ ఫ్రెండ్​ ఒకరు నిద్ర లేచి చూసేసరికి నరేష్​ బిల్డింగ్​మెట్ల వద్ద స్టీల్​ రాడ్​కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. 

పోలీసులకు సమాచారమివ్వగా వారు నరేశ్ ​తల్లిదండ్రులకు చెప్పారు. వారు తాము వచ్చే వరకు డెడ్​బాడీ కదిలించొద్దని చెప్పడంతో సాయంత్రం వరకు వేచి చూశారు. వారు వచ్చిన తర్వాత బాడీని పోస్టుమార్టం కోసం ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నరేశ్ ​కొద్దికాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, ఆ యువతి నరేష్​ను ప్రేమించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.