కొత్త పోలీస్ బాస్ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి.. డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కారు

కొత్త పోలీస్ బాస్ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి.. డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కారు
  • సీఎం చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి 
  • 1994 బ్యాచ్​ ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కొత్త డీజీపీగా బి. శివధర్‌‌‌‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్​ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌లోని  నివాసంలో శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ అందజేశారు. 1994 బ్యాచ్​ ఐపీఎస్‌‌‌‌ అధికారి అయిన శివధర్‌‌‌‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌‌‌‌ డీజీగా కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయనను డీజీపీ (కో -ఆర్డినేషన్‌‌‌‌)గా బదిలీ చేస్తున్నట్టు ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత డీజీపీ డాక్టర్​ జితేందర్‌‌‌‌ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో డీజీపీ (హెచ్‌‌‌‌వోపీఎఫ్‌‌‌‌- హెడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌) ఫుల్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ చార్జ్‌‌‌‌గా కూడా శివధర్‌‌‌‌రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ  పోస్టులో కొనసాగుతారని వెల్లడించారు.

లాయర్‌‌‌‌‌‌‌‌ టు డీజీపీ
విధి నిర్వహణలో అత్యంత సమర్థుడైన అధికారిగా శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌‌‌‌లో చదువుకున్న శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ పూర్తి చేశారు. కొంతకాలం అడ్వకేట్‌‌‌‌గా ప్రాక్టీస్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌‌‌‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌‌‌‌లోకి ప్రవేశం పొందారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రేహౌండ్స్‌‌‌‌ స్క్వాడ్రన్ కమాండర్‌‌‌‌‌‌‌‌గా‌‌‌‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన సమయంలో.. ఎస్‌‌‌‌ఐబీలో డీఐజీగా కూడా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషించారు. 

నయీం ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో..
2014-–2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌‌‌‌గా శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పనిచేశారు. 2016 లో జరిగిన గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ నయీం ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌లో కీలకంగా వ్యవహరించి, గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పనిచేశారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని  అప్పటి ప్రభుత్వం  నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన అధికారిగా శివధర్‌‌‌‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.

విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా‌‌‌‌ పనిచేసిన సమయంలో రోడ్డు భద్రత కోసం ‘అరైవ్‌‌‌‌ ఎలైవ్‌‌‌‌..’ పేరిట  క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అనుభవం ఉంది. పర్సనల్ వింగ్‌‌‌‌లో ఐజీ, అడిషనల్ డీజీగా,  అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గా పనిచేశారు.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌గా మళ్లీ శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 2024 లో డీజీపీగా ప్రమోషన్ పొందిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఉత్తమ సేవలకుగానూ శివధర్‌‌‌‌రెడ్డి గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్, ఐక్యరాజ్యసమితి మెడల్స్‌‌‌‌సహా అనేక అవార్డులు అందుకున్నారు. కాగా, రాష్ట్ర పోలీస్​బాస్‌‌‌‌గా శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి నియమితులుకావడంపై ఆయన స్వగ్రామం తులేకలాన్‌‌‌‌ లో ఆనందం నెలకొన్నది. శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి నియామకంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.