ఖైరతాబాద్, వెలుగు: మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీజేపీలో ఉన్నాను.. కానీ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్కు మూడేసి పదవులెందుకని ప్రశ్నించారు. పదవులు పొందిన వారు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి గాని వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
వీరు ఎవ్వరినీ ఎదగనివ్వరని, పార్టీలో కనీసం తనకు ఏ బాధ్యత అప్పగించలేదని పేర్కొన్నారు. ఐదేండ్ల కింద పార్టీలో చేరినప్పుడే ఎంపీగా పొటీ చేస్తానని చెప్పానని గుర్తుచేశారు. తనకు అక్షరాభ్యాసం వరంగల్ బొజ్జన్నపేటలో జరిగిందని, తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది చిరకాల కోరిక అని పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి టికెట్ రాకున్నా.. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.