హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈక్రమంలో బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో పాటు..బేబీ మూవీ టీమ్ ఈ బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.
ఇక్కడే పుట్టి పెరిగిన..
తాను పాతబస్తీలోనే పుట్టి పెరిగానని హీరోయిన్ వైష్ణవి చైతన్య తెలిపింది. చిన్నప్పటి నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నానని చెప్పింది. ప్రతీ ఏడాది అమ్మానాన్నలతో కలిసి ప్రతి పండగకు ఈ అమ్మవారి ఆలయానికి వస్తానని వెల్లడించింది. బేబీ మూవీ విజయం తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని..అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.
బేబీ మూవీ విడుదలకు ముందు హీరోయిన్ వైష్ణవి చైతన్య లష్కర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. అప్పుడు సామాన్య భక్తురాలిలా క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్న ఆమె...బేబీ మూవీ హిట్ తో రేంజ్ పెరిగిపోయింది. పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పెషల్ ఎంట్రీతో సింహవాహిని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంది.
యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన బేబీ మూవీ జులై 14న గ్రాండ్ గా విడుదలై సక్సస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ముందే అందులోని పాటలు ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్లో జనానికి నచ్చేసింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 14న గ్రాండ్గా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.