
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు జూన్ 1 నుంచి మూతపడనున్నాయనే వార్తా వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని.. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ చెబుతూ వస్తున్నారు.రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్స్లో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనేనే థియేటర్స్ ఓపెన్ అవుతాయని లేదంటే బంద్ పెడతామని డిసైడ్ అయ్యారు. అయితే, ఈఇష్యూ గతకొన్ని కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్ల ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో ఘటికాచలం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బేబీ మూవీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ (SKN) స్పందించారు. జూన్ 1న థియేటర్స్ బంద్ కు పిలువడంపై ఓ జర్నలిస్టు నుంచి ప్రశ్న ఎదురైంది. సినీ పెద్దలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరూ కలిసి పలు విషయాలపై ఆలోచించాలని చెప్పుకొచ్చారు.
SKN వెల్లడించిన విషయాలు:
"పర్సంటేజీ, రెంట్ లు, షేర్ లు ఇవి కాకుండా ఆడియన్స్ సైడ్ నుంచి ఇంకో ఫిర్యాదు ఉంది. ఇలా పర్సంటేజీ విధానంపై కాకుండా థియేటర్లలో ప్రేక్షకుల పర్సంటేజీ పెంచే విషయంపై సినీ పెద్దలు ఆలోచన చేయాలి. ఎందుకంటే, ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం తగ్గించేశారు. ముఖ్యంగా వారిని ఎలా థియేటర్స్ వైపు వచ్చేలా చేయడానికి గల అంశాలపై ఆలోచించాలని అన్నారు. టికెట్ రేట్లు, తినుబండారాలు, వేరే రాష్ట్రాల మాదిరిగా ఫ్లెక్సిబుల్ టికెట్ ధరలు ఉంటాయి.. అలా దీన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని తన అభిప్రాయం పంచుకున్నారు.
ముఖ్యంగా మార్నింగ్ షోకు వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈవెనింగ్ షో, వీకెండ్స్లలో ఆడియన్స్ బాగా వస్తున్నారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని టికెట్ ధరల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. మాములు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడమా.. లేదంటే వీకెండ్స్లో ధరలు పెంచడమా అనే దానిపై ఆలోచన చేయాలి.
అలాగే ఏదైనా సినిమా రెండు వారాల్లో ఎలాగూ ఓటీటీకి వస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు కాబట్టే థియేటర్కు ఎందుకని ఆలోచిస్తున్నారు. వేరే ఇండస్ట్రీలో (హిందీ, తమిళం) ఉన్నట్లు కచ్చితంగా 8 వారాల తర్వాతే సినిమా ఓటీటీకి వచ్చేలా విధానం తీసుకురావాలని" నిర్మాత శ్రీనివాస్ కుమార్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
‘ఘటికాచలం’ విషయానికి వస్తే..
నిఖిల్ దేవాదుల, ఆర్వికా గుప్తా జంటగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథను అందిస్తూ నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాను వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇదొక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా మే30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.