
- ఆ పాఠశాలల్లో1,224 మంది స్టూడెంట్ల చేరిక
- రంగారెడ్డిలో 26, నాగర్ కర్నూల్లో 23 స్కూళ్లు..
- మరిన్ని బడులు పున:ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు
- సత్ఫలితాలిచ్చిన బడి బాట ప్రోగ్రామ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో.. మూతపడ్డ పలు స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పటి వరకూ 23 జిల్లాల్లో 138 బడులు రీ ఓపెన్ అయ్యాయి. టీచర్లు, పేరెంట్స్, గ్రామస్తుల సహకారంతో క్లోజ్ అయిన స్కూళ్లక పునర్వైభవం వచ్చింది. గత విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,960 స్కూళ్లలో జీరో ఎన్ రోల్మెంట్ నమోదైంది. స్టూడెంట్లు లేకపోవడంతో ఆ స్కూళ్లను అధికారులు మూసివేశారు. అక్కడ పనిచేస్తున్న 627 మందిని ఇతర స్కూళ్లకు డిప్యుటేషన్పై పంపించారు.
ప్రభుత్వం బడిబాట కార్యక్రమంలో మూతబడిన స్కూళ్లను తెరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నది. బుధవారం నాటికి 23 జిల్లాల్లో 138 బడులు తిరిగి తెరుచుకున్నాయి. వీటిలో 1,224 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారు. వీరికి ప్రభుత్వం తరఫున ఉచితంగా నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్అందించారు. అయితే, జీరో ఎన్రోల్మెంట్స్కూళ్ల రీఓపెన్ పై పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పిల్లలు రాగానే ఆయా స్కూళ్లకు టీచర్లనూ కేటాయించారు.
ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో..
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26 స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. వీటిలో 210 మంది స్టూడెంట్స్ చేరారు. నాగర్ కర్నూల్ లో 23 స్కూళ్లలో 129 మంది, ఖమ్మంలో 15 స్కూళ్లలో 196 మంది అడ్మిషన్ తీసుకున్నారు. కొత్తగా రీఓపెన్ అయిన 138 బడుల్లో ఒక హైస్కూల్, 8 అప్పర్ ప్రైమరీ స్కూళ్లుండగా, 29 ప్రైమరీ స్కూళ్లున్నాయి. ఈ సారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గర్ల్స్ హైస్కూల్ తెరుచుకున్నది. రెండు, మూడు చోట్ల ఒకరిద్దరు అడ్మిషన్ తీసుకున్నా.. స్కూళ్లను రీఓపెన్ చేశారు. త్వరలోనే మూతపడిన మరిన్ని స్కూళ్లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫీజుల భారం ఎక్కువై.. కొందరు ప్రైవేటు బడుల నుంచి సర్కారు బడుల్లో చేరగా.. గవర్నమెంట్ స్కూల్స్పై టీచర్లు, అధికారులు కల్పించిన నమ్మకంతో ఎక్కువ మంది అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిసింది.
జనగామ జిల్లాలోని ఎర్రకుంట తండా ప్రైమరీ స్కూల్ లో పిల్లలెవరూ చేరకపోవడంతో రెండేండ్ల కింద మూతపడింది. తాజాగా బడిబాట కార్యక్రమంలో పేరెంట్స్ ను చైతన్యం చేయడంలో అక్కడి అధికారులు సఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది ఏకంగా 49 మంది విద్యార్థులు చేరారు. ఫస్ట్ క్లాస్లో 26 మంది అడ్మిషన్ తీసుకోవడం విశేషం. ఈ స్కూల్ను ఇటీవలే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఓబులరావు బంజార్ ప్రైమరీ స్కూల్ రెండేండ్ల క్రితం క్లోజ్ అయింది. సర్కారు సంస్కరణలతో మళ్లీ బడి తెరుచుకున్నది. ఈ ఏడాది కొత్తగా 31 మంది చేరారు. ఒకటో తరగతిలో 15 మంది, రెండో తరగతిలో ఐదుగురు, మూడో క్లాస్లో ముగ్గురు, నాలుగో తరగతిలో 8 మంది అడ్మిషన్ తీసుకున్నారు.