
పారిస్: గతకొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు తిరిగి ఫామ్లోకి వచ్చింది. 2025, ఆగస్ట్ 25 నుంచి పారిస్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధు శుభారంభం చేసింది. మంగళవారం (ఆగస్ట్ 26) జరిగిన తొలి రౌండ్లో సింధు ఏకపక్ష విజయం సాధించింది. బల్గేరియన్ క్రీడాకారిణి కలోయానా నల్బంటోవాను 23-21, 21-6 తేడాతో వరుస గేమ్లలో చిత్తు చేసి రెండో రౌండ్కు దూసుకెళ్లింది.
పారిస్లోని అడిడాస్ అరీనాలో జరిగిన ఈ మ్యాచ్లో సింధు వార్ వన్ సైడ్ చేసింది. తొలి సెట్లో 3-7తో తడబడ్డ భారత షట్లర్.. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. 12-12తో స్కోర్ సమం చేసి చూస్తుండగానే 15-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కలోయానా కాస్తా ప్రతిఘటించిన సింధు అద్భుతంగా ఆడి 22-21తో మొదటి సెట్లో విజయం సాధించింది.
మొదటి సెట్ హోరాహోరీగా సాగగా.. రెండో సెట్ను సింధు ఏకపక్షం చేసింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెరుపు షాట్లతో విరుచుకుపడింది. 11-5తో ఆధిక్యంలో ఉన్న సింధు.. ఆ తర్వాత ఒక్క పాయింట్ మాత్రమే కోల్పోయి 21-6 తేడాతో రెండో గేమ్ను అలవోకగా గెల్చింది. 23-21, 21-6 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఆటను ముగించింది.
తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ విజయం:
భారత పురుషుల బ్యాడింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ విజయంతో వరల్డ్ ఛాంపియన్షిప్స్ను ఆరభించాడు. మంగళవారం (ఆగస్ట్ 26) జరిగిన తొలి రౌండ్ మ్యాచులో ఫిన్లాండ్కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ జోకిమ్ ఓల్డోర్ఫ్పై ప్రణయ్ విజయం సాధించాడు. 21-18-21-15 తేడాతో జోకిమ్ ఓల్డోర్ఫ్ను చిత్తు చేశాడు. ఒలింపిక్స్ తర్వాత తన ఫిట్నెస్, ఫామ్తో ఇబ్బంది పడుతున్న ప్రణయ్ ఈ మ్యాచ్ ప్రారంభంలొ కాస్త తడబడ్డాడు.
మొదటి గేమ్లో 2-5తో వెనుకబడిన ప్రణయ్ తిరిగి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మొదటి గేమ్ను కైవసం చేసుకునే వరకు ఆధిక్యాన్ని అలాగే కొనసాగించాడు. రెండవ గేమ్లో 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్.. ఆట చివరి వరకు ఆధిపత్యం కొనసాగించాడు. చివరకు 21-15 తేడాతో రెండో సెట్ను గెల్చుకున్నాడు.