వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. రూ. 30 వేలతో పాటుగా ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. పోలీసులపై దాడి కేసులో ఏప్రిల్ 24 సోమవారం రోజున షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.
నాంపల్లి కోర్టులో షర్మిలను హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే దీనిపై షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కొన్ని షరతులను కూడా విధించింది. వీదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తప్పనిసరి చేసింది. సాయంత్రం షర్మిల జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది..
షర్మిలపై కేసులు..
ఏప్రిల్ 24వ తేదీన పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్సై రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 4 సెక్షన్లు 332, 353, 509, 427 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడా జైలుకు తరలించారు. ఏప్రిల్ 24వ తేదీ షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తుండగా మహిళా కానిస్టేబుల్ ను షర్మిల తోసేశారు. ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. మరో కానిస్టేబుల్ కాలుపై నుంచి షర్మిల కారు పోనీయడంతో గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసినందుకు గానూ షర్మిలను అరెస్ట్ చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.