బిజినెస్ డెస్క్, వెలుగు: బజాజ్ అలయన్జ్, సన్లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ సహా 15 ఇన్సూరెన్స్ కంపెనీలు ఏకంగా రూ. 2,350 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు బయటపడింది. జీఎస్టీ ఎగవేతపై ఈ 15 ఇన్సూరెన్స్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు పంపించారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన 15 ఇన్సూరెన్స్ కంపెనీలపై దర్యాప్తు పూర్తయిందని ఒక సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ వెల్లడించారు. జీఎస్టీ ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాలో కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఉన్నాయి.
బడా ఇన్సూరెన్స్ కంపెనీలు..
జీఎస్టీ ఎగ్గొట్టిన 15 ఇన్సూరెన్స్ కంపెనీలపై దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. వీటిలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ , బ్యాంకులు కూడా ఉన్నాయి. జీఎస్టీ ఎగవేత రూ. 2,350 కోట్ల దాకా ఉంటుందని గుర్తించగా, ఇప్పటికే రూ. 700 కోట్లను జీఎస్టీ అధికారులు రికవర్ చేశారు. బజాజ్ అలయన్జ్, సన్లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి బడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఎగవేత ఈ విధంగా..
గూడ్స్, సర్వీసుల సప్లయ్ లేకుండానే పై 15 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 15 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడంపై జీఎస్టీ అధికారులు దర్యాప్తును నిర్వహించారు. ఈ లిస్టులో ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలూ చోటు చేసుకోవడం గమనించదగ్గది. ఈ జాబితాలోని 30 కంపెనీలలో 15 ఇన్సూరెన్స్ కంపెనీలపై దర్యాప్తును అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని ఇన్సూరెన్స్ కంపెనీలపైనా దర్యాప్తు కొనసాగుతుందని సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు. కొన్ని కంపెనీలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ కాగా, మరి కొన్ని కంపెనీలకు త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. మిగిలిన 15 ఇన్సూరెన్స్ కంపెనీలపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
అసలు సమస్య ఏంటి?
ఇన్సూరెన్స్ కంపెనీలతో జీఎస్టీ సమస్య ఎలా వచ్చిందో ఇప్పడు తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజంట్లకు కమీషన్ చెల్లిస్తాయి. ఇది సాధారణమే. కానీ, ఎలాంటి సప్లయ్ లేకుండా అదనపు కమీషన్ను ఏజంట్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించాయి. ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఎక్కువ బిజినెస్ను తెస్తారనే ఉద్దేశంతో ఏజంట్లకు అధిక కమీషన్ను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. దీంతో అలాంటి ట్రాన్సాక్షన్లపై పొందిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రికవర్ చేసేందుకు జీఎస్టీ అధికారులు కేసులు బుక్ చేశారు. కానీ, అక్కడ అసలు ఎలాంటి సప్లయ్ చోటు చేసుకోలేదనేది గమనించాలి.
ఐఆర్డీఏ దృష్టికీ..
ఇన్సూరెన్స్ కంపెనీలు జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన విషయాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) దృష్టికి జీఎస్టీ అధికారులు తీసుకెళ్లారు. ఏజంట్లకు చెల్లించే కమీషన్పై విడిగా అంతకు ముందున్న పరిమితిని ఐఆర్డీఏఐ తొలగించింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు వాటి మొత్తం ఖర్చులపైనే సీలింగ్ పెట్టింది. జీఎస్టీ ఎగవేతపై హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్లైఫ్, బజాజ్ అలయన్జ్, ఫైనాన్స్ మినిస్ట్రీలకు పంపిన ప్రశ్నలకు సమాధానం రాలేదు.
హెచ్డీఎఫ్సీ లైఫ్ ..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, ముంబై జోనల్ యూనిట్ నుంచి నోటీసు వచ్చినట్లు జూన్ 23 నాడు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. 2017–2022 మధ్య కాలానికి రూ. 942.18 కోట్ల జీఎస్టీ రికవరీ ఎందుకు చేయకూడదో చెప్పమని జీఎస్టీ అధికారులు కోరుతూ ఆ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్స్కు సంబంధించి పై నోటీసు జారీ అయినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ పరిశ్రమలోని అన్ని కంపెనీలకు ఈ ఇష్యూ సంబంధించినదని చెబుతూ, తగిన చర్యలను తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. జీఎస్టీ అధికారుల ఉత్తర్వులను సవాలు చేయనున్నామని, అయినా ప్రొటెస్ట్ కింద రూ. 250 కోట్లను జమ చేశామని ఆ కంపెనీ వివరించింది.