టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యే అన్నారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేస్తే ఇప్పటి వరకు చార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాంలో ఫ్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎందుకు చేర్చలేదన్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టాలనే కుట్రతోనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు బాలకృష్ణ. ముందు ముందు చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు వేస్తారని చెప్పారు. ఇలాంటివి ఎన్నో్ చూశామని.. న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. స్కిల్ డెవ్ లప్ మెంట్ గుజరాత్ లోఅమలు చేశారని..అక్కడ చూసే ఏపీలో అమలు చేశారన్నారు. స్కిల్ డెవ్ లప్ మెంట్ తో 72 వేల మందికి ఉద్యోగాలిచ్చామని అన్నారు.
చంద్ర బాబును జైల్లో పెట్టాలనే కుట్రతోనే ఈ స్కామ్ క్రియేట్ చేశారని ఆరోపించారు బాలకృష్ణ. చేతులు ముడుచుకుని కూర్చుంటే కుదరదన్నారు. జనం సైనికులై తిరగబడాల్సిన టైం వచ్చిందన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని..త్వరలో తాను వస్తున్నానని చెప్పారు. 1984 లో ఎన్టీఆర్ ను బర్త్ రఫ్ చేసిన సమయంలో ఉద్యమించినట్టు ఇపుడు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మొరిగే కుక్కులు మొరుగుతాయని వాటిని పట్టించుకోనన్నారు బాలకృష్ణ. జగన్ కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదన్నారు.
నవరత్నాలంటూ జగన్ 8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ మండిపడ్డారు. ఆ అప్పులన్నీ ఎవరు తీర్చుతారని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లంటూ ఇప్పటి వరకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. మాట ఇస్తే మాట తప్పని పార్టీ తమదన్నారు. అది తమకు ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిందన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ వల్ల తెలుగు ఖ్యాతి పెరిగిందన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. మన హక్కుల కోసం మనం పోరాడాలన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతే ఉద్యమాలు చూశామన్నారు. ఇవాళ రాష్ట్రం కుంటుబడిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు దిక్కతోచని స్థితిలో ఉందన్నారు. రాజధాని లేని పరిస్థితిలో ఏపీ ఉందన్నారు. జగన్ వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.