రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్. జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల అవుతోంది. రీసెంట్గా ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేవదాస్’ నుంచి రామ్ ప్రయాణం చూస్తున్నాం. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ఎంతో తపన ఉన్న నటుడు. తను మరిన్ని చిత్రాలు చేసి గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. శ్రీలీల వరుస సినిమాలు చేస్తున్నా తనలో ఎలాంటి అలసట కనిపించదు. తనకి మరింత పేరు ప్రఖ్యాతలు రావాలి. నటీనటులనుంచి చక్కని నటన రాబట్టుకోవడంలో బోయపాటి దిట్ట.
నిర్మాత శ్రీనివాస చిట్టూరి గారు గ్రాండ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకులు మంచి విజయాన్ని అంaదించాలని కోరుకుంటున్నా’ అన్నారు. రామ్ మాట్లాడుతూ ‘బోయపాటి గారు ఏదైనా మొండిగా నమ్ముతారు. నేను ఆయన్ను నమ్మాను. అందుకే అవుట్పుట్ బాగా వచ్చింది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మూడు జనరేషన్స్ జై బాలయ్య అంటుందంటే.. ఒక నటుడికి అది పెద్ద అచీవ్ మెంట్. ఇంతకంటే మించిన అవార్డ్ ఉండదు’ అన్నాడు. ఇక చివరగా ఫ్యాన్స్ కి ఒక మాట చెప్పాలి అని.. ట్రైలర్లోని డైలాగ్ ‘పులి వేటకి వచ్చింది’ అని చెప్పాడు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా. యాక్షన్, ఎమోషన్ హై లెవల్స్లో ఉంటాయి. ఒక పాత్ర ఇస్తే దాన్ని ఎలా చేయాలని నిరంతరం తపన పడే వ్యక్తి రామ్. త్వరలోనే బాలకృష్ణ గారితో ‘అఖండ2’ ఉంటుంది’ అన్నారు. హీరోయిన్స్ శ్రీలీల, సయీ మంజ్రేకర్, నిర్మాత శ్రీనివాస చిట్టూరి, తమన్, శివమణి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.