చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్త పై .. బాల్క సుమన్ అనుచరుల దాడి

చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్త పై .. బాల్క సుమన్ అనుచరుల దాడి
  • గాయపడ్డ గణేశ్​
  • పోలీసులకు  ఫిర్యాదు

జైపూర్, వెలుగు :  బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో ఎందుకు చేరావంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని షెట్​పల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడి చేశారు. షెట్​పల్లికి చెందిన నక్క గణేశ్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్​కు చెందిన జైపూర్​జడ్పీటీసీ మేడి సునీత భర్త తిరుపతి అనుచరులతో కలిసి సోమవారం రాత్రి షెట్​పల్లిలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నక్క గణేశ్ ఇంట్లోకి చొరబడిన తిరుపతి అనుచరులు సంపత్, భీమయ్య..గణేశ్​ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ ఘటనలో గణేశ్ గాయపడ్డాడు. బాధితుడు గణేశ్​ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, జడ్పీటీసీ అనుచరులతో తనకు ప్రాణ హాని ఉందన్నాడు. ఎక్కడ కనిపించినా తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఈ దాడిపై కాంగ్రెస్ లీడర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.