బనకచర్లపై న్యాయ పోరాటం.. లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

బనకచర్లపై న్యాయ పోరాటం.. లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
  • 30న ప్రజాభవన్లో ప్రాజెక్ట్​పై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​
  • బీఆర్​ఎస్​ హయాంలోనే ఏపీ ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించింది
  • దాని వెనుక రాజకీయ కోణాలను బయట పెడ్తాం.. 
  • కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణను స్పీడప్​ చేయాలి
  • డిజైన్స్​ కన్సల్టెంట్​గా ఉంటామని ఎన్డీఎస్​ఏ ముందుకొచ్చింది
  • ఎస్​ఎల్బీసీ ప్రాజెక్టుకు లైడార్  సర్వే చేయాలని సూచన
  • టన్నెల్​ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సలహాదారులుగా ఇద్దరు ఆర్మీ నిపుణులు

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్​ తలపెట్టిన పోలవరం– బనకచర్ల (పీబీ) లింక్​ ప్రాజెక్టును ఆపించేందుకు న్యాయ పోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు లీగల్​ రోడ్​ మ్యాప్​ను తయారు చేయాల్సిందిగా అధికారులను ఇరిగేషన్​ శాఖ  మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు. ఏపీ అక్రమంగా కడుతున్న ఆ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. కోర్టులో తెలంగాణ వాదనలను గట్టిగా వినిపించేలా ప్రాజెక్ట్​ను చాలెంజ్​ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బనకచర్ల ప్రాజెక్టు, ఇరిగేషన్​ శాఖలోని ఇతర అంశాలపై బుధవారం జలసౌధలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్​ సమీక్షించారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేలా కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

బనకచర్ల ప్రాజెక్టును ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టుపై ఈ నెల 30న ప్రజాభవన్​లో పవర్​పాయింట్​ ప్రజెంటేషన్ (పీపీటీ)  ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అప్​డేట్లతో పీపీటీలు తయారు చేయాలని సూచించారు. ‘‘బీఆర్​ఎస్​ హయాంలోనే ఏపీ ఆ ప్రాజెక్టును ఎలా పట్టాలెక్కించిందో అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టాలి. ఏపీ ప్రస్తుతం ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది.. కాబట్టి బీఆర్​ఎస్​ హయాంలో ఏపీకి ఎలా సహకరించారో, దాని వెనకున్న రాజకీయ కోణాలేంటో బయటపెట్టేలా పీపీటీలుండాలి” అని అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​ను సీఎం రేవంత్​, మంత్రి ఉత్తమ్​ కుమార్  రెడ్డిలు కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సబ్మిట్​ చేసిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఆమోదించొద్దని విజ్ఞప్తి చేశారు. 

టన్నెల్ ప్రాజెక్టులకు నిపుణులు
రాష్ట్రంలో టన్నెల్​ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూసేందుకు అందులో నైపుణ్యం ఉన్న ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తున్నట్టు అధికారులతో మంత్రి ఉత్తమ్​ చర్చించారు. ఇండియన్​ ఆర్మీ రిటైర్డ్​ ఈఎన్సీ జనరల్​ హర్​పాల్​ సింగ్​ను ఇరిగేషన్​ శాఖ గౌరవ సలహాదారుగా ఆహ్వానించినట్టు చెప్పారు. అంతర్జాతీయ టన్నెల్​ టెక్నాలజీ నిపుణుడైన కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా.. జులైలో ఇరిగేషన్​ శాఖకు వస్తారని పేర్కొన్నారు.  

మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టండి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. బ్యారేజీల పునరుద్ధరణపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్​ఏ) సిఫార్సులను ఎలాంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని చెప్పారు. బ్యారేజీలకు డిజైన్​ కన్సల్టెంట్​గా పనిచేస్తామని ఎన్డీఎస్​ఏ ముందుకొచ్చిందన్నారు. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ గైడ్​లైన్స్​కు తగ్గట్టు బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని చెప్పారు. వీలైనంత వేగంగా వాటి పనులను స్టార్ట్​ చేయాలన్నారు. 

ఎస్ఎల్బీసీకి లైడార్​ సర్వే
శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ కెనాల్​ (ఎస్​ఎల్బీసీ) టన్నెల్​ పనుల విషయంలో  ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు అధికారులకు మంత్రి ఉత్తమ్​ సూచించారు. టన్నెల్​ పనుల కోసం అంతర్జాతీయ సంస్థలు సహా పలు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రాజెక్టుకు లైడార్​ సర్వే నిర్వహించాలన్నారు. ఖర్చు గురించి పట్టించుకోవద్దని, నిర్మాణంలో నాణ్యత పాటించాలని ఆయన ఆదేశాలిచ్చారు. దేశంలో అత్యాధునిక టెక్నాలజీలను వాడుకుని పనులు చేయాలన్నారు. అత్యుత్తమ, నిపుణులైన సిబ్బందిని ప్రాజెక్ట్​ వద్ద నియమించాలని.. ఇతర పరికరాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని రిక్రూట్​ చేసుకోవాలన్నారు. 

పూడికతీతపై దృష్టి సారించండి
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో పూడికతీతపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. చాలా ప్రాజెక్టులు 25 శాతం వరకు పూడుకుపోయాయన్నారు. నాగార్జునసాగర్​, నిజాంసాగర్​లో పూడికతీత పనులు ఎలా సాగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాగార్జునసాగర్​లో పూడికతీత పనులను మొదలుపెట్టాలని, దీనిపై ఏపీతో చర్చించాలని సూచించారు. దేవాదుల ప్యాకేజ్​– 3 పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రస్తుతమున్న బడ్జెట్​లోనే  సీతారామ ప్రాజెక్టు అదనపు ప్యాకేజీల నిర్మాణాన్ని చేపట్టే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. పనులు ఎక్కడా ఆగకుండా చూడాలన్నారు.

సింగూరు కెనాల్​ నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని, వీలైనంత త్వరగా ఒప్పందం పూర్తయ్యేలా చూసి పనులు మొదలుపెట్టాలని ఆయన ఆదేశించారు. డిండి ప్రాజెక్టు ఇంటర్ లింకేజ్​ కో ఆర్డినేషన్​ ఎంత వరకొచ్చిందని అధికారులను ఉత్తమ్​ ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమయ్యేలా భూసేకరణ చేపట్టేందుకు ఆ ప్రాజెక్టు లింకేజ్​ ఉన్న జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇరిగేషన్​ ప్రాజెక్టుల పనులు ఆలస్యం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి వారం ప్రాజెక్టు పనుల పురోగతిపై రివ్యూలు పెట్టుకోవాలన్నారు. టైమ్​లైన్​కు తగ్గట్టు పనిచేయని అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రాజెక్టుల ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ను సమర్థంగా నిర్వహించాలన్నారు. 

త్వరలోనే ప్రమోషన్లు
ప్రమోషన్లు, బదిలీల విషయంలో సుదీర్ఘంగా పెండింగ్​లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్​ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. రివ్యూ సందర్భంగా పలువురు ఏఈఈలు.. మంత్రి ఉత్తమ్​ను కలిసి ప్రమోషన్ల ప్రక్రియను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేండ్లుగా 125 డీఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరారు. 17 ఏండ్లుగా ఏఈఈలుగా పనిచేస్తున్నామని, అన్ని అర్హతలున్నా ప్రమోషన్లు ఇవ్వడం లేదని, ఫలితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారని వాపోయారు. వీలైనంత త్వరగా ప్రమోషన్లను ఇస్తామని వారికి మంత్రి ఉత్తమ్​ హామీ ఇచ్చారు.