
- వరద కష్టనష్టాలు భరించాలిగానీ ఆ ఫ్లడ్తో ప్రాజెక్టులు కట్టుకోవద్దా?
- సీమను సస్యశ్యామలం చేసేందుకే బనకచర్లనుచేపడుతున్నం..
- దాంతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం జరగదు
- ఇండిపెండెన్స్డే స్పీచ్లో వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే వరదతో దిగువ రాష్ట్రంగా కష్టనష్టాలను భరిస్తున్నామని, అలాంటి వరద నీటితో ప్రాజెక్టులు నిర్మించుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. వరద కష్టాలు, నష్టాలను భరించాలిగానీ.. ఆ వరదతో ప్రయోజనాలు పొందకూడదంటే ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర్య దిన వేడుకల్లో చంద్రబాబు ప్రసంగించారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించేలా ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సముద్రంలో కలిసే వృథా నీటితోనే ప్రాజెక్టును చేప డుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం జరగదని, ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, ప్రకాశం జిల్లాను కరువు నుంచి బయటపడేసేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది జులై నాటికి సాగునీటిని అందిస్తామని తెలిపారు.
2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జాతికి అంకితమిస్తామని స్పష్టం చేశారు. రాయల సీమకు నీటిని అందించే హంద్రీనీవా సుజల స్రవం తి స్కీమ్పై గత ప్రభుత్వం నాటకమాడిందని మండి పడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆ లిఫ్ట్ ద్వారా 3,850 క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్లలో 785 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి ఏపీ 30 ఏండ్లు వెనక్కిపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయిందని, అమరావతి ఆగిపోయిందని అన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిని దీవించి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారని, 94 శాతం స్ట్రైక్ రేట్, 54 శాతం ఓట్ షేర్తో గెలిచామని తెలిపారు.