తెలంగాణ తొలి దశ ఉద్యమంలో రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షను ప్రజలకు చాటి చెప్పిన వ్యక్తి మల్లికార్జున్ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత మల్లికార్జున్ 82వ జయంతి, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ సాధన కోసం1969 తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన సేవలు ఎనలేవని దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం సందర్భంగా యువతను మెల్కొల్పి.. పోరాటంలో అందరూ భాగమయ్యేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు.
తెలంగాణ సేఫ్గార్డ్స్ పేరుతో మల్లికార్జున్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ప్రధాని పీఠం ఎక్కడంలో ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఏదైనా కూడలి లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయాల్లో శ్రద్ధ,అంకితభావం కనుమరుగు అవుతోందని.. ఇది దురదుష్టకర పరిణామం అని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు.