
హైదరాబాద్, వెలుగు: జీవో 317 సవరణ కోసం ఉద్యోగులు, టీచర్లు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏ స్థానికత కోసమైతే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో.. అదే స్థానికత కోసం ఇప్పుడు కూడా పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు. టీచర్స్, ఎంప్లాయీస్ యూనియన్ పాంప్లెట్ను మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద పార్టీ నేతలు వెదిరే శ్రీరామ్, శాంతికుమార్, ప్రకాశ్ రెడ్డితో కలిసి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 317 జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జీవోను సవరించాలని కోరుతున్న వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. సకల జనుల సమ్మె వంటి చారిత్రక పోరాటంలో పాల్గొన్న ఉద్యోగులు.. ఇప్పుడు ఒక్క జీవో సవరణ కోసం అదే తీరుగా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు.