బీఆర్ఎస్ నేతలు.. చవటలు.. దద్దమ్మలు: బండి సంజయ్

బీఆర్ఎస్ నేతలు.. చవటలు.. దద్దమ్మలు: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: ‘‘బీఆర్ఎస్ చవటలు, దద్దమ్మల్లారా.. మీరెందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు.. మీరు నిజమైన తెలంగాణ వాదులే అయితే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే వెంటనే ఆ పార్టీని వీడి బయటకురండి” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో  నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  బండి సంజయ్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. 

బీజేపీ కార్యకర్తలకు ఆదివారం మూడు పండుగలన్నారు. అందులో ఒకటి.. తెలంగాణ విమోచన దినోత్సవం, రెండోది ప్రధాని మోదీ పుట్టిన రోజు.. మూడోది విశ్వకర్మ జయంతి అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నుంచి అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం విమోచనోత్సవాలను పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా ప్రజల అభిమతాన్ని గుర్తించి కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు దగుల్బాజీ పార్టీలు. విమోచన దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.

నయా నిజాం పాలన

తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాలను ఎందుకు జరుపుకోవడం లేదని తిట్టిన కేసీఆర్.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ‘‘ఆ నోరేమైంది, సిగ్గుండాలే.. అధికారంలోకి వచ్చాక నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్. తెలంగాణలో మళ్లీ నయా నిజాం పాలన అమలు కాబోతోందని.. అప్పుడే అర్థమైంది. 

ఆనాడు భయపడ్డట్లే ఇప్పుడు జరుగుతోంది. పాతబస్తీలో నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలిపిన ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదు. ఎన్నికల కోసం ఇప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త రాగం అందుకున్నడు” అని అన్నాడు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు కానీయబోదన్నారు. ‘దేశ ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లలాలని భగవంతుడిని కోరుకుంటున్న” అని అన్నారు.