బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పర్సెంట్ కమీషన్ సర్ కార్ : బండి సంజయ్

బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పర్సెంట్ కమీషన్ సర్ కార్ : బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పర్సెంట్ కమీషన్ సర్ కార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్లో విమర్శించారు. దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు రూ. 3లక్షల దాకా కమీషన్ తీసుకున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పేపర్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని 40 శాతం కమీషన్ సర్కార్ అని బీఆర్ఎస్ నేతలు విమర్శించిన దానికి   కౌంటర్ గా సంజయ్ ఈ ట్వీట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. 

మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. ఇదే లాస్ట్ వార్నింగ్

ఏప్రిల్ 27న జరిగిన  బీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారని, ఆ చిట్టా మొత్తం తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే రిపీట్ అయితే పార్టీ టిక్కెట్ కాదు, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ ఇదే తన చివరి వార్నింగ్ అంటూ సీఎం సంచలన కామెంట్స్ చేశారు. 

ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండొద్దని, ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువే ఉందన్న ఆయన.. టికెట్ల పంచాయితీపైనా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 100సీట్లు లక్ష్యంగా నేతలంతా పని చేయాలని, టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని చెప్పారు.