బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. బాన్సువాడ ప్రజల సొమ్మును అడ్డగోలుగా పోచారం, ఆయన కొడుకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. స్టేషనరీ కుంభకోణంలో చంద్రబాబు కేబినెట్ నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బర్తరఫ్ అయ్యారని.. అప్పుడే ఆయనకు అవినీతి మంత్రిగా పేరుందని ఆరోపించారు. ఒక్క సారి బాన్సువాడ ప్రజలు ఆలోచించాలని.. బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. నీతివంత మైన పాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని బండి సంజయ్ అన్నారు . టీఎస్ పీఎస్ సీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని.. నష్టపోయిన అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. సిట్ పై తమకు నమ్మకం లేదని.. సిట్టింగ్ జడ్జిపైనే నమ్మకముందన్నారు. టీఎస్ పీఎస్ సీ ఘటనపై వెనక్కి తగ్గేది లేదని.. పోరాటం ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో, బాన్సువాడలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో అన్నింట్లోనూ స్కాంలేనని ఆరోపించారు. తానెప్పుడూ బూతులు మాట్లడలేదని.. తెలంగాణ భాషలో మాట్లాడిన అని చెప్పారు. భాషలో తనకు కేసీఆరే గురువని అన్నారు బండి సంజయ్. ఏప్రిల్ 23న అమిత్ షా పార్లమెంట్ ప్రవాస్ లో భాగంగా చేవెళ్లకు వస్తున్నారని చెప్పారు.. అదే రోజు సాయంత్రం బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.