- గత ప్రభుత్వ మూర్ఖత్వం వల్ల
- తెలంగాణ నష్టపోయింది
- సీఎం రేవంత్రెడ్డి సహకరిస్తున్నందునే కేంద్రం నుంచి నిధులొస్తున్నయ్
- కేంద్ర మంత్రి బండి సంజయ్
వేములవాడరూరల్, వెలుగు : ‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం, గత ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది, ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుంచి నిధులొస్తున్నాయి’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం– సిరికొండ రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏడేండ్లలో రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పారు. వేములవాడ నుంచి సిరికొండ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ పనులకు కేంద్రం సీఆర్ఐఎఫ్ కింద రూ. 23 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోవాలని సూచించారు. కరీంనగర్ – -వరంగల్ నేషనల్ హైవే, ఎల్కతుర్తి– -సిద్దిపేట నేషనల్ హైవే పనులు స్పీడ్గా సాగుతున్నాయన్నారు. కరీంనగర్-- – జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. సైనిక్, నవోదయ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని బండి సంజయ్ని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీజేపీ నేతలు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, రాపెల్లి శ్రీధర్ పాల్గొన్నారు.
