
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన.. దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్.. దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడం వల్ల.. దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించ లేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయని బండి సంజయ్ రాసిన లేఖలో వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురద్రుష్టకరమని బండి సంజయ్ అన్నారు. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ.. అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరమన్నారు. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయమని బండి ఆరోపించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉందని... తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడం వల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని చెప్పారు. లాంగ్ జంప్తో పాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. లాంగ్ జంప్లో ఆన్ ది లైన్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని.. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు గాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని బండి సంజయ్ కోరారు. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు.