
గాలె: శ్రీలంకతో మంగళవారం మొదలైన తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (136 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (105 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే టైమ్కు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 292/3 స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాను ఆరంభంలో లంక బౌలర్లు కట్టడి చేశారు.
షాద్మాన్ ఇస్లామ్ (14), అనాముల్ హక్ (0), మోమినల్ హక్ (29) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫలితంగా 45 రన్స్కే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఇన్నింగ్స్ను నజ్ముల్, ముష్ఫికర్ ఆదుకున్నారు. లంక బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు అజేయంగా 247 (443 బాల్స్) రన్స్ జోడించారు. తరిండు రత్ననాయకే రెండు, అషితా ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.