కరోనా దెబ్బతో ఇబ్బంది పడుతున్న కస్టమర్ల కోసం ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లను అందుబాటులోకి తెచ్చాయి. ‘కోవిడ్ –19 పర్సనల్ లోన్’ పేరుతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా జీతం అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నవారి కోసం ఈ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని టాప్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన లోన్ ఆఫర్స్ ఇలా ఉన్నాయి. .
యూనియన్ కోవిడ్ 19–పర్సనల్ లోన్ స్కీమ్
1) ఎలిజిబిలిటి: కేటగిరి –1
ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగి అయి ఉండాలి. పేరున్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా అర్హులు. కానీ వీరి జీతం లేదా పెన్షన్ అకౌంట్ యూనియన్ బ్యాంక్లో ఉండాలి. కనీసం గత 12 నెలల నుంచి ఈ అకౌంట్ నుంచి జీతం లేదా పెన్షన్ను తీసుకుంటున్న వారు అయి ఉండాలి.
కేటగిరి–2
- కనీసం 12 లేదా అంత కంటే ఎక్కువ నెలల రీపేమెంట్ హిస్టరీ ఉన్న ప్రస్తుత రిటైల్ బారోవర్లు అర్హులే.
- వీరు హోం, వెహికల్, పర్సనల్ లోన్, క్యాష్ లోన్ వంటి అప్పులను తీసుకున్నవారు అయి ఉండాలి.
- కేటగిరి–1 కింద ఎలిజిబుల్ అయిన వారికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. లేదా చివరిగా పడిన జీతం లేదా పెన్షన్ అమౌంట్కు ఆరు రెట్లు ఇస్తారు.
- ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్(ఫ్లోటింగ్ రేట్స్)కు తగ్గట్టు వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం ఇది 7.20 శాతంగా ఉంది. ఆర్బీఐ రెపో రేట్లను మారిస్తే ఈ రేటు మారుతుంది
- ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం ఈ లోన్స్కు వర్తిస్తుంది కానీ ఈ అమౌంట్పై వడ్డీని వసూలు చేస్తారు.
- గరిష్టంగా 60 నెలల్లో(మూడు నెలల మారటోరియం కూడా కలిపి) లోన్ తిరిగి చెల్లించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బరోడా పర్సనల్ లోన్ కోవిడ్ 19
- ఎలిజిబిలిటి: ఇప్పటికే బ్యాంక్ నుంచి హోంలోన్, ప్రొపర్టీ లోన్, ఆటో లోన్ తీసుకున్నవారు అర్హులు. వీరికి లోన్ అమౌంట్ పూర్తిగా అంది ఉండాలి. కనీసం మూడు ఇన్స్టాల్మెంట్లను చెల్లించి ఉండాలి. 29.02.2020 నాటికి వీరి అకౌంట్ ఎస్ఎంఏ–1 కేటగిరి కింద ఉండకూడదు.
- రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల మధ్య లోన్ ఇస్తారు.
- అప్పును గరిష్టంగా 60 నెలల్లో చెల్లించవచ్చు.
- ఆర్బీఐ ఇచ్చిన మారటోరియంను వాడుకోవచ్చు. వీటిని పై60 నెలల్లో కలిపి లెక్కిస్తారు. మారటోరియం పిరియడ్లో లోన్ అమౌంట్పై వడ్డీని వసూలు చేస్తారు.
- బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్(బీఆర్ఎల్ఎల్ఆర్)+ఎస్పీ+2.75 శాతం వడ్డీని వసూలు చేస్తారు.
పీఎన్బీ నుంచి ‘సహ్యోగ్’
- ఎలిజిబిలిటి: ప్రభుత్వ ఉద్యోగులు, పేరున్న కంపెనీలు లేదా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులు.
- ఈ స్కీమ్ 30.06.2020 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- గరిష్టంగా రూ. మూడు లక్షల వరకు లోన్ పొందొచ్చు.
- ఉద్యోగుల నికర జీతం మెట్రో, అర్బన్ ఏరియాలలో రూ. 15,000 అయి ఉండాలి. సెమీ అర్బన్, రూరల్ ఏరియాలలో రూ. 10,000 గా ఉండాలి.
- ఈ లోన్ను గరిష్టంగా 36 నెలల్లో తీర్చేయాలి. వడ్డీ రేటు 9.05 శాతం.
యోనో ఎమెర్జెన్సీ లోన్స్ లేవు
ఎస్బీఐ ఎమెర్జెన్సీ ప్రి అప్రూవ్డ్ లోన్ స్కీమ్ను తాజాగా అందుబాటులోకి తెచ్చిందని, దీని ద్వారా కస్టమర్లు 45 నిమిషాల్లోనే రూ. 5 లక్షల వరకు లోన్ను పొందొచ్చని, మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి స్కీమ్ ఏదీ స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేయట్లేదని, యోనో యాప్ ద్వారా కూడా ఎటువంటి ఎమెర్జెన్సీ లోన్ను ఆఫర్ చేయడం లేదని బ్యాంక్ క్లారిఫై చేసింది.