న్యూఢిల్లీ:కస్టమర్లకు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను రాబోయే రెండు క్వార్టర్లలో 25–50 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇవి తమ ‘మార్జిన్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్– బేస్డ్ లెండింగ్ రేట్’ (ఎంసీఎల్ఆర్) ను పెంచుతున్నాయి. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ బారోవర్లు ఇక నుంచి అప్పులపై ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి రావచ్చు. అన్ని రేట్లూ పెరుగుతున్నాయని, చవక వడ్డీ రేట్ల కాలం ముగిసినట్టేనని ఎనలిస్టులు అంటున్నారు. ఒక పర్సంటేజ్ పాయింట్లో నూరవవంతును బేసిస్ పాయింట్ అంటారు. లోన్లపై కనీస వడ్డీ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఇంతకంటే తక్కువ వడ్డీ రేటుకి అప్పులు ఇవ్వవు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ని పెంచినప్పుడు, కొత్త బారోవర్లు తమ ఆటో, హోం, వెహికల్ లోన్ల కోసం మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాబోయే నెలల్లో వారి ఈఎంఐలు పెరుగుతాయి. “ 2023 మార్చి నాటికి వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతారు. 2024 మార్చి నాటికి మరో 50 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. ఆర్బీఐ రేట్ల పెంపు ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ రెండవ క్వార్టర్ నుండి ప్రారంభమవుతుందని అనుకుంటున్నాం” అని ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్లోని కోర్ ఎనలిటికల్ గ్రూప్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి అన్నారు. లోన్ల రేట్లు ప్రస్తుత స్థాయుల నుండి 100–-125 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని, దీనివల్ల బారోవర్ల జేబుపై చాలా భారం పడుతుందని మరో ఎనలిస్టు స్పష్టం చేశారు.
డిమాండ్ తగ్గే ప్రమాదం..
ఈఎంఐలకు కట్టే అమౌంట్ పెరిగితే బ్యారోవర్లు మిగతా ఖర్చులు తగ్గించుకుంటారు. దీనివల్ల కన్సంప్షన్, డిమాండ్ చాలా తగ్గుతుంది. బ్యాంకుల కిస్తీలు ఆలస్యమై బకాయిలు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ , మూడేళ్లలో మొదటిసారిగా ఈ నెలలో అన్ని టెన్యూర్ల లోన్లపై ఎంసీఎల్ఆర్ను 15 నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఇటీవల తమ ఎంసీఎల్ఆర్ను పెంచాయి. బుల్లెరో క్యాపిటల్లోని ఫండ్ మేనేజర్ డైరెక్టర్ వరుణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు ఉండటంతో స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ వంటి మార్కెట్ లీడర్లు ఎంసీఎల్ఆర్ను పెంచుతాయని అన్నారు. ఇతర బ్యాంకులు కూడా ఇదే బాట పడుతాయని అన్నారు. స్టేట్బ్యాంక్లో ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.1 శాతం కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లలో ఇది 7.25 శాతం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉండగా, యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్7.40 శాతం ఉంది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉన్నందున ఆర్బీఐ జూన్లో రెపో రేట్లను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 17 నెలల హైలెవెల్ 6.95 శాతానికి ఎగబాకగా, టోకు ధరల ఇన్ఫ్లేషన్ వరుసగా 12 నెలల నుంచి రెండంకెలకు తగ్గడం లేదని బార్క్లేస్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా అన్నారు. జూన్ క్వార్టర్ నుంచి ఆర్బీఐ రెపో రేటును వరుసగా నాలుగు సార్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రెపో రేటు నాలుగు శాతం నుండి 5 శాతానికి పెరగవచ్చని చెప్పారు. అన్ని రకాల లోన్లకు వడ్డీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. రెపోరేటు మారకున్నా కొన్ని బ్యాంకులు వడ్డీలు పెంచుతాయని బ్యాంక్బజార్డాట్కామ్ సీఈఓ ఆదిల్ శెట్టి అన్నారు. రెపో రేటును పెంచితే ‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్-లింక్డ్ లెండింగ్ రేట్’ (ఈబీఎల్ఆర్) కూడా పెరుగుతుందని, దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్బీఐ ఈబీఎల్ఆర్ ను అక్టోబర్ 2019 నుంచి అమలు చేస్తోంది. అప్పటి నుండి బ్యాంకుల లోన్లు, డిపాజిట్ రేట్లు మెరుగుపడ్డాయి. ఈ నెల 18న విడుదల చేసిన ఆర్బీఐ నెలవారీ బులెటిన్ ప్రకారం, బ్యాంకుల ఈబీఎల్ఆర్ లోన్ల వాటా సెప్టెంబర్ 2019లో 2.4 శాతం నుండి మార్చి 2021లో 28.6 శాతానికి డిసెంబర్ 2021లో 39.2 శాతానికి పెరిగింది.