- డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్లను విస్తరిస్తున్న టాప్ బ్యాంకులు
- ఇప్పటికే 12 ప్రభుత్వ బ్యాంకులు రంగంలోకి..
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంకులు కూడా
- సర్వీస్లపై ఛార్జీలు తప్పవు
బిజినెస్ డెస్క్, వెలుగు: ‘డోర్ స్టెప్ బ్యాంకింగ్.. ఈ ఏడాది మార్చిలోపు ఒక క్వార్టర్కు ఒక ట్రాన్సాక్షన్ ఫ్రీ! బ్యాంకు బ్రాంచులను విజిట్ చేయడం ఎందుకు, బ్యాంకే మీ దగ్గరకు వస్తున్నప్పుడు!’.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు పంపుతున్న మెసేజ్ ఇది. క్యాష్ విత్డ్రా, డిపాజిట్ (కనీసం రూ. 5,000 , గరిష్టంగా రూ. 25 వేలు) లేదా చెక్ పికప్ వంటి సర్వీస్లను ఇంటి నుండే పొందండి’ అని బ్యాంక్ కస్టమర్లకు మెసేజ్లు పంపుతోంది. మనీ డిపాజిట్, విత్డ్రా, అకౌంట్ ఓపెనింగ్, ఫిక్స్డ్ డిపాజిట్స్..ఇలాంటి బ్యాంకింగ్ సేవలన్నింటినీ టాప్ బ్యాంకులు ఇంటికే వచ్చి అందిస్తున్నాయి. మొదట సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు మాత్రమే ఈ సేవలను ఆఫర్ చేసిన బ్యాంకులు, ప్రస్తుతం కామన్ కస్టమర్కు కూడా అందిస్తున్నాయి. కానీ, ఎక్స్ట్రాగా సర్వీస్ ఛార్జీని+ ట్యాక్స్ను వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే 12 ప్రభుత్వ బ్యాంకులు ఒక కన్సార్టియంగా కలిసి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ (డీఎస్పీ) పోర్టల్ను తీసుకొచ్చాయి. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి టాప్ ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇంటి వద్దకే బ్యాంక్ సర్వీస్లను తెస్తున్నాయి.
హోమ్ బ్రాంచు అందిస్తుందా?
తమ హోమ్ బ్రాంచ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్లను అందిస్తుందో? లేదో? కస్టమర్లు ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల వెబ్సైట్లో దీనికి సంబంధించిన డిటెయిల్స్ అందుబాటులో ఉంటాయి. లేకపోతే కస్టమర్ కేర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. దీంతో పాటు కరోనా రిస్ట్రిక్షన్ల వలన బ్యాంకులు డోర్ స్టెప్ సర్వీస్లు ఆగిపోయాయా లేదా అనేది ముందు తెలుసుకోవాలి. ఉదాహరణకు, కరోనా వలన డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్లు తాత్కాలికంగా ఆగిపోయాయని ఐసీఐసీఐసీ బ్యాంక్ తమ వెబ్సైట్లో పేర్కొంది. కరోనా రిస్ట్రిక్షన్లు స్ట్రిక్ట్గా అమలవుతుఉన్న ఏరియాల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్లపై ప్రభావం ఉంటుందని కోటక్ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఎస్బీఐ నుంచి ఐఎంపీఎస్ ఫ్రీ..
డిజిటల్ బ్యాంకింగ్ను పెంచేందుకు ఎస్బీఐ కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. యోనో ద్వారా ఐఎంపీఎస్ మోడ్లో రూ. 5 లక్షల వరకు జరిగే ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఛార్జీని వసూలు చేయమని ప్రకటించింది. అలానే బ్యాంక్ బ్రాంచుల ద్వారా ఐఎంపీఎస్ మోడ్లో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల లోపు జరిగే ట్రాన్సాక్షన్లపై రూ. 20+ జీఎస్టీని వసూలు చేయడం ప్రారంభించింది. వచ్చే నెల 2 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. యోనో ద్వారా ఆర్టీజీఎస్, నెఫ్ట్ మోడ్లలో రూ. 5 లక్షల వరకు జరిగే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను ఎస్బీఐ విధించడం లేదు.
సర్వీస్ ఛార్జీలు..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లు డోర్స్టెప్ బ్యాంకిం గ్ సర్వీస్లను పొందాలంటే బ్యాంకుల దగ్గర రిజిస్టర్ చేసుకున్న నెంబర్తో హెచ్డీఎఫ్సీ ఫోన్ బ్యాంకింగ్ సర్వీస్కు కాల్ చేయాలి. ఒక విత్డ్రాకు కనిష్టంగా రూ. 5 వేలు, గరిష్టంగా రూ. 25 వేలు డెలివరీ చేస్తారు. క్యాష్ పికప్, డెలివరీ చేయడానికి రూ. 200 + ట్యాక్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వసూలు చేస్తోంది. రోజులో సాయంత్రం 3 లోపు అందే సర్వీస్ రిక్వెస్ట్లను మొదటి రోజే ఫుల్ఫిల్ చేస్తారు. సాయంత్రం 3 తర్వాత అందే రిక్వెస్ట్లను తర్వాత రోజు లేదా ఆ తర్వాత రోజు కంప్లీట్ చేస్తారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ల కోసం స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్ వద్ద రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఒక విజిట్లో జరిగే నాన్–ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్పై రూ. 60+ జీఎస్టీని బ్యాంక్ వసూలు చేస్తోంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రూ. 100 + జీఎస్టీని విధిస్తారు. ఒక రోజులో ఒక ట్రాన్సాక్షన్లో చేసే విత్డ్రాయల్, డిపాజిట్ అమౌంట్ రూ. 20 వేలు కంటే ఎక్కువ ఉండకూడదు. డెలివరీని వీలున్నంత తొందరగా పూర్తి చేస్తారు. టీ+1 (రిక్వెస్ట్ పెట్టిన రోజు + తర్వాత రోజు) రోజుల్లోపే పూర్తి చేస్తామని ఎస్బీఐ చెబుతోంది.
పంజాబ్ నేషన్ బ్యాంక్ (పీఎన్బీ)..
70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు లేదా దివ్యాంగులు పీఎన్బీ డోర్స్టెప్ సర్వీస్లను పొందడానికి అర్హులు. ప్రస్తుతం బ్యాంక్ బ్రాంచు నుంచి 5 కి.మీలలోపు ఉన్న కస్టమర్లకే ఈ సర్వీస్లను అందిస్తోంది. నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ. 100+ట్యాక్స్ను ఈ బ్యాంక్ విధిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కోటక్ బ్యాంక్ డోర్ స్టెప్ సర్వీస్లను పొందడానికి అర్హులు. దివ్యాంగులకు కూడా డోర్స్టెప్ సర్వీస్లను అందిస్తోంది. వేరు వేరు సర్వీస్లకు వేరు వేరు ఛార్జీలను కోటక్ బ్యాంక్ విధిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్లో ఈ ఛార్జీల గురించి తెలుసుకోవచ్చు.