- ఎస్పీ రాజేశ్చంద్ర
బాన్సువాడ రూరల్, వెలుగు : ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీసులకు సూచించారు. మంగళవారం బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, రిసెప్షన్, రైటర్ రూమ్ను పరిశీలించి, స్టేషన్ను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కేసుల నమోదు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాన్సువాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచనలు చేశారు. వచ్చిన ఫిర్యాదులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై దృష్టి సారించాలని, చోరీల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతర పెట్రోలింగ్, గస్తీ, అనుమానితులపై నిఘా పెట్టాలన్నారు. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పని చేయాలని సూచించారు. గతేడాది నేరాలు, దొంగతనాల నివారణకు సమిష్టిగా కృషి చేసినందుకు సిబ్బందిని అభినందించారు. డీఎస్పీ శ్రీ విఠల్ రెడ్డి, బాన్సువాడ టౌన్ సీఐ శ్రీధర్, బాన్సువాడ రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, సిబ్బంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరం
కామారెడ్డిటౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ఆఫీసులోని కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ పరిశీలించారు. ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించిన వారికి సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చాలాన్ల విధింపును పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ను అనుసంధానం చేశామన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణతో పాటు, నిందితులను గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. లైసెన్స్లేకుండా, నంబర్ ఫ్లేట్ లేకుండా తిరిగే వెహికల్స్ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
