మైనారిటీ ‌‌గురుకులాల్లో అడ్మిషన్ల కోసం అడ్డదారులు

మైనారిటీ ‌‌గురుకులాల్లో అడ్మిషన్ల కోసం అడ్డదారులు
  • గురుకులాల్లో సీట్లకు ఉన్న   డిమాండ్​ను సొమ్ము చేసుకుంటున్న దళారులు
  • సహకరిస్తున్న పలువురు ప్రిన్సిపాల్స్​, ఆర్ఎల్సీలు
  • తహసీల్దార్లు ఇవ్వాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్లకు బదులు 
  • సెల్ఫ్ అఫిడవిట్లు ఇచ్చినా ఓకే చెప్తున్న ఆఫీసర్లు
  • పాస్టర్లు ఇచ్చే బాప్టిజం సర్టిఫికెట్లతో ప్రవేశాలు

కరీంనగర్, వెలుగు: మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పిల్లలు బాప్టిజం స్వీకరించినట్టు సర్టిఫికెట్లు పెట్టి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నారు. గురుకులాల్లో సీట్లకు ఉన్న డిమాండ్​ను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు కొన్నాళ్లుగా ఈ దందా సాగిన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా కొందరు ప్రిన్సిపాల్స్​, ఆర్ఎల్​సీల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలిసింది.

నాన్ క్రిస్టియన్లకు ఇలా ప్రతి ఏటా వందలాది బాప్టిజం సర్టిఫికెట్లు జారీ చేస్తూ దళారులు, అధికారులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అసలు ఏ క్యాస్ట్ సర్టిఫికెట్ అయినా తహసీల్దార్ జారీ చేస్తేనే ప్రామాణికమైనప్పటికీ ఇలా పాస్టర్లు ఇచ్చే బాప్టిజం సర్టిఫికెట్​ను గురుకులాల అధికారులు ‘బీసీ - సీ’ సర్టిఫికెట్​గా పరిగణించడం చర్చనీయాంశంగా మారింది. 

నాన్​ మైనారిటీస్​తో మైనారిటీ సీట్లు..  

రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూల్స్​ ఉండగా, వీటిలో 107 బాయ్స్​కి, 97 గురుకులాలు గర్ల్స్​కు కేటాయించారు. ఒక్కో గురుకులంలో 5వ తరగతిలో 80 సీట్లు అలాట్ చేశారు. ఇందులో 60 సీట్లు మైనార్టీలకు, 20 సీట్లు నాన్ మైనార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. 60 మైనారిటీ సీట్లలోనూ 51 సీట్లు ముస్లిం స్టూడెంట్స్​కు, ఐదు క్రిస్టియన్లకు, అలాగే బౌద్ధ, సిక్కు, జైన, పార్శీలకు కలిపి 4 సీట్లు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఒకవేళ క్రిస్టియన్లు, బౌద్ధ, సిక్కు, జైన, పార్శీ కేటగిరీల్లో విద్యార్థులు చేరనప్పుడు ఆ సీట్లను కూడా ముస్లిం విద్యార్థులతో భర్తీ చేసే వెసులుబాటు ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీ సీట్లను నాన్ మైనారిటీలకు కేటాయించకూడదనే నిబంధనను టెమ్రీస్ బైలాస్​లో పొందుపరిచారు. కానీ, మైనార్టీ కేటగిరీలోని చాలా గురుకులాల్లో  ఏటా పది నుంచి 15 వరకు సీట్లు మిగిలిపోతుండడం, మిగిలిన గురుకులాల్లో సీట్లకు డిమాండ్​ ఉండడంతో.. బాప్టిజం సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్​తో మైనారిటీ కేటగిరీ సీట్లను నింపేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దళారులతో కొందరు విజిలెన్స్ ఆఫీసర్లు, ఆర్ఎల్సీలు, ప్రిన్సిపాల్స్​ చేతులు కలపడంతో అడ్మిషన్ ప్రక్రియ కూడా సులువుగా మారినట్లు తెలుస్తోంది.

ఉదాహరణకు  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 19 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఏటా 100 నుంచి 150 బాప్టిజం సర్టిఫికెట్లతో నాన్ క్రిస్టియన్లు మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లు పొందుతున్నట్లు తెలుస్తోంది.  ఒక్కో అడ్మిషన్ కోసం 40 వేల నుంచి 70వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు మైనారిటీ లీడర్లు ఆరోపిస్తున్నారు.

క్యాస్ట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లేకుండానే అడ్మిషన్లు.. 

వాస్తవానికి విద్య, ఉద్యోగ అవకాశాల కోసం సమర్పించే క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తహసీల్దార్ ధ్రువీకరించినదై ఉండాలని గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నాయి. కానీ, మైనార్టీ గురుకులాల్లో మాత్రం కేవలం చర్చి పాస్టర్ ఇచ్చే బాప్టిజం సర్టిఫికెట్​ను, సెల్ఫ్ అఫిడవిట్​ను బీసీ - సీ సర్టిఫికెట్​గా పరిగణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక అడ్మిషన్ల సమయంలో క్రిస్టియన్ గా పేర్కొని.. రికార్డుల్లో మాత్రం అసలు కులం పేరును పేర్కొంటున్నట్లు తెలిసింది. 

బాప్టిజం సర్టిఫికెట్లపై ఎంక్వైరీ చేయాలి.. 

ముస్లిం విద్యార్థులతో భర్తీ చేయాల్సిన సీట్లను ప్రిన్సిపాల్స్​, ఆర్ఎల్సీలు, విజిలెన్స్ ఆఫీసర్లు కుమ్మక్కయి బాప్టిజం సర్టిఫికెట్లు తీసుకొచ్చిన వారితో భర్తీ చేస్తున్నారు. బాప్టిజం సర్టిఫికెట్లు తీసుకొచ్చిన పిల్లల తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది  నాన్ క్రిస్టియన్లే ఉంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా రూ.కోటి దందా నడుస్తోంది. వివిధ చర్చిల పాస్టర్లు, గురుకులాల ప్రిన్సిపాల్స్​, విజిలెన్స్ ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బంది కలిసే ఈ దందా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ, సీబీసీఐడీ విచారణ జరిపించాలి. 


-ఎండీ తాజుద్దీన్, అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్