మోడీ ఒక్కరే టాయిలెట్లపై మాట్లాడారు: కోవింద్

మోడీ ఒక్కరే టాయిలెట్లపై మాట్లాడారు: కోవింద్
  • ఏ ఇతర ప్రధానీ ఆ అంశాంపై చర్చించలేదు: కోవింద్
  • సోషియాలజీ ఆఫ్ శానిటేషన్ సమావేశంలో కామెంట్
  • పరిశుభ్రతపై సులభ్ కృషి అద్భుతం: మెడీ

న్యూఢిల్లీ : టాయిలెట్ల నిర్మాణం గురించి ప్రధాని నరేంద్ర మోడీ తప్ప అంతకుముందున్న ఏ ఒక్క ప్రధాని కూడా మాట్లాడలేదని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఎర్రకోట వేదికగా టాయిలెట్ల అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సోషియాలజీ ఆఫ్ శానిటేషన్  జాతీయ సమావేశంలో కోవింద్ మాట్లాడారు.పరిశుభ్రత, పారిశుధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మోడీ సందేశం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. గాంధీ కూడా పరిశుభ్రత, పారిశుధ్యానికే ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘శుభ్రంగా ఉండడమంటే దేవుడికి దగ్గరగా ఉండడమేనని గాంధీ అనేవారు. మనసు పరిశుద్ధంగా లేకపోతే, దేవుడి ఆశీర్వాదం పొందలేం. అలాగే మన శరీరం శుభ్రంగా లేకపోయినా భగవంతుడు ఆశీర్వదించడు. అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉంటే మన శరీరం ఎలా శుద్ధంగా ఉంటుంది?” అని కోవింద్  వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా టాయిలెట్లు కట్టాలని, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మోడీ చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

పరిశుభ్రత గురించి ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది ప్రధాని మోడీయే అని ఆయన పేర్కొన్నారు. ‘‘టాయిలెట్లు కట్టాలని ఎర్రకోట నుంచి మోడీ సందేశం ఇచ్చినపుడు కొంత మంది ఆయన వ్యాఖ్యలను ఎగతాళి చేశారు. టాయిలెట్ల కట్టడం ప్రధానమంత్రి పనా అంటూ ఎద్దేవా చేశారు. కానీ మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆయన నొక్కి చెప్పారు” అని కోవింద్  గుర్తుచేశారు. కాగా, ఆదివారం ప్రారంభమైన సోషియాలజీ ఆఫ్  శానిటేషన్ జాతీయ సమావేశం మూడు రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి వైస్ చాన్స్​లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సులభ్  ఇంటర్నేషనల్ కు చెందిన సులభ్  ఇంటర్నేషనల్  స్కూల్ ఆఫ్​ యాక్షన్  సోషియాలజీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. పారిశుధ్యం, దాని అధ్యయనాల కోసం విధానాలను రూపొందించాలని విద్యావేత్తలను ఈ సందర్భంగా కోవింద్  కోరారు. శానిటేషన్, సామాజిక సేవల్లో సులభ్ ఇంటర్నేషనల్  ఫౌండర్  బిందేశ్వర్   పాఠక్  చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ సమావేశం గ్రాండ్  సక్సెస్  కావాలని ప్రధాని మోడీ సందేశం పంపించారు. ‘‘పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ప్రతిఒక్కరికీ సేఫ్ శానిటేషన్  సౌకర్యాలు అందించడంలో సులభ్  ఇంటర్నేషనల్ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం” అని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. వర్సిటీల్లో సోషియాలజీ ఆఫ్  సానిటేషన్ స్టడీపై మరింత కృషి చేయాలని మాజీ సీజేఐ తిరథ్  సింగ్  ఠాకూర్.. విద్యావేత్తలకు పిలుపునిచ్చారు. బిందేశ్వర్  పాఠక్  చేస్తున్న కృషికి భారతరత్న ఇవ్వాలని, పద్మభూషణ్  అవార్డు ఆయనకు సరిపోదని ఆయన పేర్కొన్నారు.