బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్​

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్​
  •     జూన్ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
  •     జూన్​ 22 వరకు ఆన్​లైన్​ అప్లికేషన్లు 
  •     జులై 3న సెలెక్షన్ లిస్ట్​ విడుదల
  •     నిరుడి మాదిరిగానే 1500 సీట్ల భర్తీ
  •     వివరాలు వెల్లడించిన వీసీ ప్రొఫెసర్ ​వెంకటరమణ

హైదరాబాద్, వెలుగు : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో 2024–25 విద్యాసంవత్సరానికి  ఆరేండ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1నుంచి ఆన్ లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. 

పీహెచ్, సీఏపీ, ఎన్​సీసీ, స్పోర్ట్స్ తదితర స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు ప్రింట్స్ ను​ పోస్టు ద్వారా పంపేందుకు జూన్ 29 వరకు గడువు ఉందని చెప్పారు. జులై 3న ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును రిలీజ్ చేస్తామని వెల్లడించారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 8,9,10వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

 నిరుడు మాదిరిగానే ఈసారి కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, గ్లోబల్ సీట్లకు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ, ఇంటర్నేషనల్ కోటాలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వంద డాలర్ల ఫీజు ఉంటుందని స్పష్టం చేశారు. 

టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు

పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వెంకటరమణ  చెప్పారు. ఆర్టికల్ 371 డి ప్రకారం ఈ విద్యాసంవత్సరం కూడా 85% సీట్లు లోకల్ కింద తెలంగాణకు  కేటాయించామని, మిగిలిన 15% సీట్లకు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీ పడొచ్చని తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ సర్కారు విద్యాసంస్థల్లో చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు అదనంగా 0.4 స్కోర్​ను యాడ్ చేస్తామని వెల్లడించారు. 

ఒకే రకమైన గ్రేడ్ వస్తే.. మ్యాథ్స్,సైన్స్, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టుల్లోని గ్రేడ్​లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్  చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు admissions@rgukt.ac.in, https://www.rgukt.ac.in అధికారిక వెబ్ సైట్ ను సంపద్రించాలని వీసీ వెంకటరమణ సూచించారు.