
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ బేయర్, వరికి సోకే పొడ తెగులు (షీత్ బ్లైట్)ను సమర్థవంతంగా నియంత్రించడానికి రూపొందించిన ఫంగిసైడ్ ఫెలుజిత్ను మనదేశంలో విడుదల చేసినట్లు ప్రకటించింది. దీనిని మనదేశంలోని వరి పండించే రాష్ట్రాల్లో రైతులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఫెలుజిత్ను పెన్ఫ్లూఫెన్, టెబుకొనజోల్ అనే రెండు క్రియాశీల పదార్ధాల ప్రత్యేక కలయికతో తయారు చేశామని తెలిపింది.
షీత్ బ్లైట్ వ్యాధి కారకమైన రైజోక్టోనియా ఎదుగుదలను ఇది సమర్థవంతంగా నిరోధిస్తుందని కంపెనీ పేర్కొంది. మొక్కలోని అన్ని భాగాలకు రక్షణ లభిస్తుందని, ఇది పంట దిగుబడి, నాణ్యతను పెంచుతుందని బేయర్ వివరించింది. ఒకసారి పిచికారీ చేస్తే ప్రస్తుత మార్కెట్ ప్రమాణాల కంటే రెట్టింపు కాలం పాటు రక్షణను అందిస్తుంది. అనేకసార్లు పిచికారీ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని బేయర్ తెలిపింది.