- సత్తా చాటిన బీసీలు..
- రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు
- 25 జిల్లాల్లో 49.16 శాతం సర్పంచ్లు బీసీలే
- 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం
- పెద్దపల్లి జిల్లాలో 69 శాతం,
- గద్వాలలో 68 శాతం స్థానాలు కైవసం
కరీంనగర్ / నెట్వర్క్, వెలుగు: మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్లు పోనూ మిగతా జనరల్ స్థానాల్లోనూ సర్పంచ్లుగా పోటీ చేసి విజయం సాధించారు. కొన్నిచోట్ల ఓసీలతో పోటీపడి గెలవగా, మరికొన్ని చోట్ల బీసీ అభ్యర్థులతోనే తలపడి గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బీసీల ఖాతాలో పడ్డాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరిగిన 98 గ్రామ పంచాయతీల్లో 68 స్థానాల్లో (69 శాతం) బీసీలే సర్పంచ్లుగా గెలుపొందారు.
అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 72 స్థానాలను(68 శాతం) బీసీలు కైవసం చేసుకున్నారు. మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా.. జనరల్ స్థానాలు పెద్దగా లేని మూడు ఏజెన్సీ జిల్లాలు భద్రాద్రి, ములుగు, ఆసిఫాబాద్ సహా వివరాలు అందని నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పక్కనపెడ్తే మిగిలిన25 జిల్లాల్లో 1,229 మంది బీసీ సర్పంచ్లు (49.16 శాతం) గెలుపొందడం విశేషం. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల(18 శాతం)కు మించి సగానికి సగం సర్పంచ్స్థానాలను గెలుచుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో 63 శాతం బీసీ సర్పంచ్లే..
కరీంనగర్ జిల్లాలో 92 గ్రామపంచాయతీలకు గాను 58 (63%) చోట్ల బీసీలే గెలిచారు. వాస్తవానికి ఈ జిల్లాలో 25 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. 47 చోట్ల జనరల్ కేటగిరీకి రిజర్వ్ కాగా.. 14 చోట్ల ఓసీలు గెలవగా, మిగతా 33 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. అలాగే సంగారెడ్డి జిల్లాలో 136 జీపీల్లో 84 స్థానాల్లో(62%) బీసీలు విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీల్లో 73 పంచాయతీలను బీసీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
మెదక్ జిల్లాలోని 160 జీపీల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 జీపీల్లో 46, సిద్దిపేట జిల్లాలో 163 గ్రామపంచాయతీల్లో 88 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందారు. మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీసీలకు జీపీలు రిజర్వ్ కాలేదు. అలాగే షెడ్యూల్ ఏరియా మండలాలు కలిగిన ఆసిఫాబాద్, ములుగు బీసీ సర్పంచ్ల సంఖ్య రెండు, మూడుకు మించలేదు. ఇవి మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ బీసీ అభ్యర్థులు సత్తా చాటారు.
14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలే గెలుపు..
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో14 గ్రామాలు జనరల్కు కేటాయించగా, ఏకంగా13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిట్టదొడ్డి గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా, ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్ కేటగిరీలో 10 గ్రామాలు ఉండగా.. 8 చోట్ల బీసీలు, ఒకచోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందారు.
ఎవరు ఎంతమంది గెలిచారంటే..
జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మొత్తం బీసీల శాతం
కరీంనగర్ 57 21 0 14 92 62
పెద్దపల్లి 68 20 0 10 98 69
రాజన్న సిరిసిల్ల 46 17 14 8 85 54
జగిత్యాల 73 23 9 17 122 60
హనుమకొండ 25 16 2 26 69 36
వరంగల్ 24 15 39 13 91 26
జనగామ 29 25 15 41 110 26
భూపాలపల్లి 21 16 2 46 85 25
ములుగు 3 2 41 1 48 6
మహబూబాబాద్ 20 10 111 14 155 12
మెదక్ 92 26 26 16 160 57
సంగారెడ్డి 84 14 16 22 136 62
సిద్దిపేట 88 36 8 31 163 54
యాదాద్రి 68 32 30 22 153 42
జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మొత్తం బీసీల శాతం
సూర్యాపేట 28 40 39 52 159 17
మహబూబ్ నగర్ 60 21 34 24 139 43
వనపర్తి 17 12 25 33 87 19
గద్వాల 72 18 4 12 106 68
నారాయణపేట 23 10 14 20 67 34
నాగర్ కర్నూల్ 41 36 24 50 151 27
కామారెడ్డి 49 26 29 63 167 29
నిజామాబాద్ 90 30 22 42 184 48
నిర్మల్ 53 21 53 9 136 39
ఆసిఫాబాద్ 2 2 98 111 114 2
ఆదిలాబాద్ 15 4 145 2 166 9
మంచిర్యాల 37 20 26 4 87 42
ఖమ్మం 49 46 37 60 192 25

