
- ఆదరించాలని ప్రజకు మంత్రి పొన్నం రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: బోనాల ఉత్సవాల సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ చేతివృత్తుల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏరియాలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో బీసీ కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువులు ప్రదర్శనకు, అమ్మకానికి ఉంటాయని మంత్రి వివరించారు.
కుమ్మరులు తయారు చేసిన మట్టి పాత్రలు, గౌడన్నల నీరా స్టాల్, మేదరి కులస్థుల వెదురు వస్తువులు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు (పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్), పూసలవారి సామగ్రి, ఇతర బీసీ వర్గాల చేతివృత్తి ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి. అంతేకాకుండా, తెలంగాణ సంప్రదాయ వంటకాల స్టాల్స్, బెస్త సోదరుల చేపల వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుందని, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై బీసీ కళాకారుల చేతివృత్తి ఉత్పత్తులను కొనుగోలు చేసి, వారిని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.