
న్యూఢిల్లీ: అనుకున్నదే జరిగింది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో ఇండియా వేదికగా జరగాల్సిన మెన్స్ టీ20 వరల్డ్కప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి తరలించారు. యూఏఈ(దుబాయ్, షార్జా, అబుదాబి)తోపాటు ఒమన్ వేదికగా వరల్డ్కప్ జరగనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ అంశాన్ని సోమవారం ప్రకటించాడు. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా తెలియజేశామని తెలిపాడు. దీంతో మెగా ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనే అంశంపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. అక్టోబర్ 17– నవంబర్ 14 మధ్య టోర్నీ జరగడం దాదాపు ఖాయమవ్వగా.. షెడ్యూల్కు సంబంధించి ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నప్పటికీ ఆతిథ్య హక్కులు బీసీసీఐ వద్దనే ఉంటాయని దాదా వెల్లడించాడు. ‘ టీ20 వరల్డ్కప్ను యూఏఈకి తరలిస్తామని ఐసీసీకి అధికారికంగా సమాచారం ఇచ్చాం. ఈవెంట్లో భాగమైన అందరి హెల్త్, సేఫ్టీని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. టోర్నీ షెడ్యూల్తోపాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. అక్టోబర్ 17న టోర్నీ ప్రారంభమనేది ఇంకా ఖాయం కాదు. క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఒమన్లో జరుగుతాయి. ప్రధాన టోర్నీ గ్రూప్ మ్యాచ్లు యూఏఈలో ఉంటాయి’ అని సౌరవ్ చెప్పాడు. కాగా, కరోనా వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరల్డ్కప్ తరలింపు తప్పలేదని స్టేట్ అసోసియేషన్లకు రాసిన లేఖలో బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నాడు.
‘ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్లేయర్ల సేఫ్టీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్కప్ తరలింపు నిర్ణయం తీసుకున్నాం. మెగా ఈవెంట్ను ఇండియాలోనే నిర్వహించాలని మేము కూడా భావించాం. కానీ తరలించక తప్పలేదు. యూఏఈలో గత ఐపీఎల్ను విజయవంతంగా పూర్తి చేశాం. ఆ అనుభవంతో వరల్డ్కప్ కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’ అని జైషా పేర్కొన్నాడు.