టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు ఐసీసీ సహకరిస్తుందన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాక్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచుల్లో అంపైర్లు టీమిండియాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని అఫ్రిదీ ఆరోపించాడు. ఐసీసీ అండతోనే అంపైర్లు టీమిండియాకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పుకొచ్చాడు. టీమిండియాను సెమీస్ ఆడించాలన్న ఉద్దేశంతోనే ఐసీసీ భారత్కు అండగా నిలుస్తోందని అక్కసు వెళ్లగక్కాడు. అయితే అఫ్రిదీ అరోపణలను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఖండించాడు.
అఫ్రిదీ వ్యాఖ్యలు కరెక్ట్ కావు..
టీమిండియాపై అఫ్రిదీ చేసిన ఆరోపణలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఒక ఫంక్షన్లో పాల్గొన్న బిన్నీ..అఫ్రిదీ భారత జట్టుపై ఆరోపణలు సమంజసం కాదన్నాడు. టీమిండియాకు ఐసీసీ అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. ఐసీసీ అన్ని క్రికెట్ జట్లను సమానంగా చూస్తుందన్నాడు. ఇతర జట్లతో పోల్చుకుంటే..ఐసీసీ టీమిండియాకు ఏం లాభం చేకూర్చిందో చెప్పాలని డిమాండ్ చేశాడు. క్రికెట్లో భారత్ పవర్ హౌస్ జట్టే అయినా..తామందరం సమానంగానే పరిగణించబడతామని స్పష్టం చేశాడు.
నోబాల్ వివాదం..
పాక్తో జరిగిన మ్యాచ్లో నోబాల్ వివాదాస్పదమైంది. మ్యాచ్లో చివరి ఓవర్లో అంపైర్లు నోబాల్ ఇచ్చారు. దీనిపై పాక్ అభిమానులు ట్రోల్ చేస్తూ.. కామెంట్స్ చేశారు. అయితే అది నోబాల్ ఎలా అయిందో ఇండియన్ ఫ్యాన్స్ వివరించారు. అటు భారత్ బంగ్లా మ్యాచ్లో వాన ఆగిన తర్వాత కాసేపటికే మ్యాచ్ ప్రారంభమైంది. మైదానం చిత్తడిగా ఉందని బంగ్లా కెప్టెన్ చెప్పినా అంపైర్లు మ్యాచ్ ప్రారంభించడాన్ని బంగ్లా, పాక్ అభిమానులు తప్పుబట్టారు. ఇదే మ్యాచ్లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బంగ్లా జట్టు సభ్యుడు నురుల్ హసన్ ఆరోపించాడు. దీన్ని గమనించడంలో కూడా అంపైర్లు విఫలమయ్యారు. దీంతో అంపైర్లు కావాలనే భారత్కు సహకారం అందిస్తున్నారని అఫ్రిదీ ఆరోపించాడు.