న్యూఢిల్లీ: ఐపీఎల్లో జరుగుతున్న క్రమశిక్షణ ఉల్లంఘనలపై బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ బస చేసే హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని బోర్డు పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పది ఫ్రాంచైజీల సీఈవోలకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాడు.
హనీ ట్రాప్ ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘అతిథులు ఎవరైనా ప్లేయర్లను కలవాలంటే ముందుగా టీమ్ మేనేజర్ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. మ్యాచ్ జరుగుతున్న టైమ్లో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లి ప్లేయర్లను కలవడం, కౌగిలించుకోవడం నిషేధం.
డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సెషన్లలో ఈ సిగరెట్లు, వేపింగ్ వాడకూడదు. ఒకవేళ వాడితే కఠినమైన చర్యలు తప్పవు’ అని బోర్డు పేర్కొంది. ప్రస్తుత సీజన్లో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ తమ గదుల్లోకి మేనేజర్లకు తెలియకుండా బయటి వ్యక్తులను అనుమతించినట్లు ఏసీయూ అధికారులు గుర్తించారు.
ఇలాంటి చర్యల వల్ల టోర్నీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, లైంగిక వేధింపుల వంటి చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందిన బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాతో పాటు సస్పెన్షన్ విధిస్తామని బోర్డు హెచ్చరించింది.
