
హైదరాబాద్: బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని, పాలక వర్గాలు బీసీలను బిచ్చగాళ్లుగా చూస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దోసోజు శ్రవణ్ అన్నారు. రాజ్యాంగ బద్దంగా బీసీలకు రావాల్సిన నియామకాల్లో వాటా రావడం లేదని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ(EFLU ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వెజిస్ యూనివర్శిటీ) నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని శ్రవణ్ అన్నారు. PHDలోనూ బీసీ స్కాలర్ లకు న్యాయం జరగడం లేదన్నారు. ఇఫ్లూలో ఒక్క బీసీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరని, ఈ విషయంలో బీసీ కమిషన్ నోటీసులు పంపినా అధికారులు లెక్కచేయడం లేదన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని, ఇఫ్లూ లో జరుగుతున్న అన్యాయంపై వివరిస్తామని చెప్పారు శ్రవణ్.