ఆ దిశగా సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వండి
అటవీ అధికారులకు పీసీసీఎఫ్ శోభ సూచన
ముగిసిన రెండ్రోజుల వర్క్షాప్
హైదరాబాద్, వెలుగు: అడవుల సమగ్ర నిర్వహణకోసం సిబ్బందికి అటవీశాఖ పనితీరుపై కచ్చితమైన అవగాహన ఉండాలని పీసీసీఎఫ్ ఆర్ శోభ అన్నారు. ఆ దిశగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి శిక్షణ ఇవ్వాలని సీనియర్ అధికారులకు సూచించారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శనివారం జరిగిన వర్క్షాప్ రెండో రోజు కార్యక్రమంలో ‘ఇన్నోవేట్ అండ్ ఇంప్లిమెంట్’ పేరిట అటవీశాఖ అమలు చేస్తున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై చర్చించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో విజయవంతమైన 9 కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
నిజామాబాద్ జిల్లాలో అటవీ భూముల సమగ్ర స్థితి, ములుగులో అటవీ భూ రక్షణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గూగుల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అటవీ పరిపాలన, జన్నారంలో వన్యప్రాణుల నిర్వహణకోసం కెమెరా ట్రాప్స్ వాడకం, ఎం-స్ట్రిప్స్ ద్వారా కవ్వాల్ పరిధిలోని జన్నారంలో పెట్రోలింగ్, వన్యప్రాణుల నిర్వహణ, అటవీ రక్షణ – కోర్టు కేసుల సత్వర పరిష్కారం, ములుగులో గడ్డి భూముల అభివృద్ధి, పాల్వంచలో కృత్రిమ పద్ధతుల ద్వారా సహజ ఆటవీకరణ, చికిత్స పద్ధతుల ప్రభావం, ఖమ్మంలో ప్రత్యామ్నాయ పరిహార భూములలో విజయవంతమైన తోటల పెంపకం, వరంగల్ అర్బన్ జిల్లాలో బోడి గుట్టలపై అటవీ అభివృద్ధి పనులను అధికారులు వర్క్షాప్లో వివరించారు. మిగతా ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. వన్యప్రాణుల నేరాల్లో నివేదికలు ఎలా రూపొందించాలన్న విషయాలను బెంగళూరు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు వివరించారు.
బొటానికల్ గార్డెన్కు ఐఎస్వో సర్టిఫికెట్
అర్బన్ లంగ్ స్పేస్ కోసం ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గానూ బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. శనివారం గార్డెన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఈ సర్టిఫికెట్ను అటవీ అధికారులకు అందజేశారు. ఓ పార్కుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఇదే మొదటిసారని తెలిపారు.