
- కుందన్బాగ్లో 20 ఏండ్ల కిందట జరిగిన
- దెయ్యాల కోటగా చిత్రీకరణ,సోషల్ మీడియాలో వైరల్
- ఐపీఎస్, ఐఏఎస్లు ఉండే ఏరియాలో అర్ధరాత్రి యూట్యూబర్ల హంగామా
- 4 రోజుల్లో 35 మంది అరెస్ట్
- పుకార్లను నమ్మొద్దంటున్న పంజాగుట్ట పోలీసులు
హైదరాబాద్, వెలుగు : బేగంపేట కుందన్బాగ్ హంటెడ్ హౌస్ యూట్యూబర్లకు షూటింగ్ స్పాట్గా మారింది.అర్ధరాత్రి షూటింగ్స్, ఫొటోగ్రఫీ చేస్తూ స్థానికులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఐఏఎస్లు,ఐపీఎస్ క్వార్టర్స్, ప్రముఖ వ్యాపార వేత్తల నివాసాలు ఉండే ప్రాంతం అయినప్పటికీ యూట్యూబర్లకు బ్రేక్లు పడడం లేదు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు హంగామా చేస్తున్నారు.దీంతో హంటెడ్ హౌస్ వద్ద బారికేడ్లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. గత4 రోజుల వ్యవధిలో దాదాపు 35 మంది యూట్యూబర్లకు పంజాగుట్ట పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
20 ఏండ్లుగా మిస్టరీ
కుందన్బాగ్లోని ఐపీఎస్ల క్వార్టర్స్ సమీపంలోని ఓ డూప్లేక్స్ బిల్డింగ్లో 20 ఏండ్ల క్రితం తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. వాళ్ల చనిపోయిన 6 నెలల తర్వాత డెడ్బాడీలు బయటపడ్డాయి.ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, మృతి చెందిన ముగ్గురు దెయ్యాలు అయ్యారని 2002 నుంచి పుకార్లు ఉన్నాయి.రాత్రి సమయాల్లో క్యాండిల్స్ పట్టుకుని తిరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు రక్తం బాటిళ్లతో ఆడుకుంటూ పాటలు పాడుతున్నారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే స్థానికులు జంకుతున్నారు.
గ్రాఫిక్స్తో కుందన్బాగ్ హౌస్ వీడియోస్
ఈ బిల్డింగ్ కుందన్బాగ్ ‘హంటెడ్ హౌస్’ పేరుతో చాలా పాపులర్ అయ్యింది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగడంతో పాటు బిల్డింగ్కు చెందిన వారు ఎవరూ లేకపోవడంతో పాడుబడిపోయింది.ఈక్రమంలోనే రూ.వందల కోట్లు విలువ చేసే డూప్లేక్స్ బిల్డింగ్ ఇప్పుడు దెయ్యాల కోటగా మారిపోయింది.ఈ బిల్డింగ్పై యూట్యూబర్లు గ్రాఫిక్స్తో వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు.వ్యూస్ కోసం హంటెండ్ హౌస్ చుట్టూ అర్ధరాత్రి చక్కర్లు కొడుతున్నారు.హర్రర్ మూవీ తరహాలో వీడియోస్ షూట్ చేస్తున్నారు. ముగ్గురు ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది కూడా తెలియకుండానే స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు.
వ్యూస్ కోసం ఫేక్ వీడియోస్ క్రియేషన్
తల్లి కూతుళ్లు దెయ్యాలు అయ్యారని కల్పిత వార్తలు సృష్టిస్తున్నారు.పాడుబడ్డ బంగ్లాలో ఎలాంటి దెయ్యాలు లేకపోయినా జనాలను భయపెట్టే విధంగా వీడియో షూట్ చేస్తున్నారు.లింక్స్, వ్యూస్ పెంచుకునేందుకు హంటెడ్ హౌస్ లొకేషన్స్ కూడా సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో కుందన్బాగ్లోని హంటెడ్ హౌస్కి రోజురోజుకు యూట్యూబర్ల తాకిడి పెరిగిపోయింది.వీరితో పాటు రాత్రిళ్లు రోడ్లపై తిరిగే ఆవారాలు కూడా హంటెడ్ హౌస్ వద్ద హంగామా చేస్తున్నారు. బైక్లపై చక్కర్లు కొడుతున్నారు.వీఐపీ జోన్లో గత పదేండ్లుగా అర్ధరాత్రి న్యూసెన్స్ పెరిగిపోవడంతో 2014లోనే స్థానికులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు గతంలో ఎంతోమందిని అరెస్ట్ చేశారు.పబ్లిక్ న్యూసెన్స్,పెటీ కేసులు నమోదు చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీస్ పెంట్రోలింగ్ పెట్టారు. ఇలాంటి వీడియోస్,స్టోరీస్ను నమ్మొద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.