
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు మాటలు జారుతున్నారని, వారికి అంత భయం ఎందుకని పీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల దరఖాస్తులపై కడియం శ్రీహరి లాంటి వాళ్లు నోరు జారి మాట్లాడుతున్నారని అన్నారు. గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, కడియం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అప్లికేషన్లను తీసుకోవడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వదలచుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క తెల్ల రేషన్కార్డు కూడా ఇవ్వలేదన్నారు. భర్త చనిపోయిన ఒంటరి మహిళలు పింఛన్ కోసం ఎదురు చూశారని, ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు నీళ్లలో పోశారని, 200 ఏండ్లు ఉండాల్సిన డ్యాములు ఐదేండ్లకే ఎందుకు కుంగుతున్నాయని ప్రశ్నించారు. అలాంటి ప్రాజెక్టుపై రివ్యూ చేస్తే డైవర్ట్ చేయడం ఎట్లా అవుతుందని నిలదీశారు. బీఆర్ఎస్నేతలు పిచ్చి మాటలు బంద్పెట్టాలని హితవు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రూ.లక్ష కోట్లపైనే అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
చెరువుల పూడికతీతకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తే.. కనీసం రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరిట కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని, తప్పు చేసిన వాళ్లు జైలు కెళ్లాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.