దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నయ్: మమత
పురూలియా (బెంగాల్): తృణమూల్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీలో చేరుతారా..? లేదా చర్యలు తీసుకోమంటారా.. అని తమ పార్టీ నేతలను భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఆదివారం పురూలియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఐటీ డిపార్ట్మెంట్లను బీజేపీ తన ఆయుధాలుగా మార్చుకుందని విమర్శించారు.
ఎన్ఐఏ, ఈడీ, సీబీఐ సంస్థలను టీఎంసీ లీడర్లను వేధించేందుకు కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. ముందస్తు సమాచారంలేకుండా దాడులు చేస్తూ, అధికారులు ఇండ్లల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. రాత్రి వేళల్లో అందరూ నిద్రిస్తున్న టైమ్లో ఇంట్లోకి ప్రవేశిస్తే మహిళలు ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వానికి ఉపాధి హామీ, పీఎం ఆవాస్ పథకాలకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.