IPL​ ఆటతో దేశం మోసపోతున్నది.. అదో కిరాయి (బాడుగ) ఆట

IPL​ ఆటతో  దేశం మోసపోతున్నది.. అదో  కిరాయి (బాడుగ) ఆట
  • పెయిడ్ ప్లేయర్స్  ఆట. 
  • ఆయా నగరాల పేర్లు పెట్టుకొని ప్రజల్లో ప్రాంతాభిమానాన్ని పెంచుతున్న ఆట. 
  • వ్యాపార  గెలుపుని..తమ నగరం గెలుపనుకొని
  • తొక్కిసలాటలో అమాయకుల చావులు!
  • బెట్టింగ్, జూదాల ఆటను చూసి దేశం మోసపోతోంది!
  • దేశభక్తిని వ్యాపార భక్తి మింగేస్తున్నది!

మనం ప్రపంచీకరణలో అడుగుపెట్టి 35 ఏండ్లు. మన జీవనశైలే మారింది. ప్రపంచీకరణ అనేక కొత్త అవకాశాలను తెచ్చింది. పాత అవకాశాలను తొక్కేసింది. అనేక కొత్త ఉపాధులను తెచ్చింది.  అలాగే, పనికిరాని ప్రతిదాన్నీ ఓ కొత్త వ్యాపారంగా, కొత్త ఉపాధిగా మార్చేసింది. కనిపించిన ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చేస్తే ఈ దేశ అస్తిత్వం ఏం మిగిలి ఉంటుందో యశస్వీ ప్రధానికి తెలియదనుకుందామా?  

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది. మన దేశానికి ప్రపంచం ఎంత అవసరమో, ప్రపంచానికి మన దేశం అంతకన్నా మరింత ఎక్కువ అవసరం. ప్రపంచ సరుకుల అమ్మకానికి మన 140 కోట్ల జనాభానే  ప్రపంచంలోకెల్ల పెద్ద మార్కెట్​. అందుకే కదా ఐపీఎల్​లాంటి బాడుగ ఆటలకు కూడా మన దేశం కేంద్రంగా మారింది!

వావి వరుసలు అక్కరలేదా? 

ఆర్థిక సంస్కరణలు అవసరమే. ప్రైవేటీకరణ  అవసరమే. వాటి ద్వారా ఉద్యోగ, ఉపాధులూ మనకు అవసరమే.  కాదనడం లేదు.  కానీ, చివరకు ఐపీఎల్​లాంటి పచ్చి వ్యాపార క్రీడలు ఈ దేశానికి అవసరమా? అనేదే ప్రశ్న. ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​) ఒప్పందంలో భారత్​ ఐపీఎల్ క్రికెట్​ ఆట ఆడాల్సిందే అనే నియమం ఏమైనా పెట్టిందా? చేస్తున్న  ప్రైవేటైజేషన్​, కమర్షియలైజేషన్​లకు  వావి వరుసలు ఉండాలని తెలియదా? వావి వరుసలను కూడా మరిచి అన్నిటినీ విచ్చలవిడి వ్యాపారానికి వదిలేస్తే దేశం ఏమవుతుందో మన యశస్వీ ప్రధాని ఒక్కసారైనా ఆలోచించాల్సిన అవసరం లేదా?  

సత్కారాలెందుకో!

కర్నాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఐపీఎల్ కప్​ గెలిచిన ఆర్​సీబీ టీంను విధాన సౌధ ముందు సత్కరించడం మరింత విచిత్రం! రాయల్​ చాలెంజర్స్​​ బెంగళూరు అని పేరు ఉన్నంత మాత్రాన అందులో  ఎంతమంది కర్నాటక ప్లేయర్లు ఉన్నారు, వారు  ఏమైనా ఆ రాష్ట్రం తరఫున ఆడారా?  ఓ ఫ్రాంచైజీ ఓనర్​కు చెందిన​ టీమ్​ను సత్కరించాల్సినంత అవసరం   ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఏమిటి?  ఇవన్నీ అంతులేని ప్రశ్నలుగా మిగులుతున్నాయి. వ్యాపారం, రాజకీయం అంతా కలిసిపోతున్న పుణ్య ఫలితమే కదా!  

అన్నీ అనర్థాలే

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన చిన్నది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో నడిచిన ఒక వ్యాపార క్రీడ అందుకు కారణం కాదా? ఆర్థిక సహాయాలతో  ప్రాణాలు తిరిగిరావు.  ఇలాంటి వ్యాపార క్రీడతో యువత తమ విలువైన సమయాన్ని నష్టపోతున్నది. బెట్టింగ్​ దుర్వ్యసనాలు పెరిగిపోతున్నాయి.  టీమ్​లకు పెట్టిన నగరాల  పేర్లు చూసి  అమాయకులు దురభిమానం పెంచుకొని నష్టపోతున్నారు. దేశం ఎన్ని రకాలుగా  నష్టపోతున్నదో కేంద్రం ఆలోచించాలి.

బెట్టింగ్​లతో  సామాన్యుల బతుకులు ఆగం

దేశానికి ఉపయోగపడాల్సిన యువత విలువైన సమయాన్ని వృథా చేయడం తప్ప ఐపీఎల్​ ఆటలతో మన దేశం సాధించుకుంటున్నదేమిటో బీసీసీఐ చెప్పాలె. ఇండియన్​ ప్రీమియర్​​ లీగ్​ గేమ్​లు ​ ఓ ఫ్రాంచైజీల వ్యాపార ఆట. అది ఎంటర్​టైన్​మెంట్​ గేమ్​ అని అంటున్నారు. 

పచ్చి వ్యాపారంతో సాగే ఆటలను ఎంటర్​టైన్​మెంట్​ గేమ్​లుగా ఎంతవరకు భావించవచ్చు? బెట్టింగ్​లు, జూదాల ఆటగా పేరుగాంచిన ఆటలను కేవలం ఎంటర్​టైన్​మెంట్​​​​గేమ్స్​ అని ఎలా అందాం? ఐపీఎల్​ మ్యాచ్​లపై  దేశంలో వేల కోట్ల బెట్టింగ్​లు జరిగాయని వార్తలు చెపుతున్నాయి. బెట్టింగ్​లు సంపన్నులే కాదు,  సామాన్యులే ఎక్కువగా ఆడారని తెలుస్తోంది. చిన్నపాటి ఆదాయ వర్గాలు ఇలా బెట్టింగ్​లు ఆడితే వారి కుటుంబాలు ఏమవుతాయో ఆలోచిస్తున్నామా? ఆర్థికంగా తట్టుకోలేక చితికిపోతున్నాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలూ చూస్తున్నాం. ఎవరిని బతికించడానికి ఐపీఎల్​ ఆటలు ఈదేశంలో ఆడిస్తున్నారో  బీసీసీఐతోపాటు, కేంద్ర పెద్దలూ చెప్పాలి. 

నగరాల పేర్లు పెట్టి..

ఫ్రాంచైజీలు అంగట్లో ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు.  వారు  ఇండియన్సే కావాలని రూలేమీ లేదు. విదేశీ ఆటగాళ్లనూ కొనుగోలు చేస్తారు. ఆట పేరేమో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.  టీమ్​లకు  దేశంలోని ప్రముఖ నగరాల పేరు పెట్టి ఆయా నగరాల ప్రజల్లో ఎక్కడా లేని దురభిమానాన్ని పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దాని ఫలితమే కదా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట. అది11  మంది ప్రాణాలను తినేసింది! 

‘మన్​కీ బాత్​’ గా స్వీకరించాలి

దారితప్పిస్తున్న  ఇలాంటి ఆటలు దేశాన్ని ఎటుతీసుకుపోతున్నాయో ఘనత వహించిన మన యశస్వీ ప్రధాని మోదీ ఆలోచించాలె. ‘మాటల్లో స్వదేశీ..చేతల్లో విదేశీ’  వల్ల దేశం మోసపోతున్నదనే విషయాన్ని  ప్రజలు గమనిస్తున్నారని ఆయన కూడా తెలుసుకోవాలి. ఇప్పటికైనా బీసీసీఐ అధీనంలో జరుగుతున్న ఐపీఎల్​ క్రికెట్​ను ఇకపై నిలిపివేయాలని ఆదేశించడమే దేశానికి శ్రేయస్కరం.  ఐపీఎల్ మ్యాచ్​లను నిషేధించాలంటున్న ‘మా భారతి’ అంతరాత్మ ఆదేశాన్ని ప్రధాని మోదీ  ‘మన్ కీ బాత్’ గా స్వీకరిస్తారా.. లేదా మన్ కీ బాత్ మైలపడి పోయిందంటారా? చూడాల్సిందే!

వరల్డ్​ కప్​ క్రికెట్​ మ్యాచ్​లంటే అందులో మన దేశ ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి, ఆ ఆటలపై ప్రతి భారతీయుడికి ఆసక్తి ఉండటం సహజం. అది దేశంపై ఉండే భక్తి, గౌరవం, మమకారం. తన దేశం గెలవాలనే ఆరాటం. దానికో అర్థం ఉంది. కానీ, ఐపీఎల్​ వ్యాపార క్రీడపై ప్రేమకు అర్థమేంటి? ఫ్రాంచైజీలు  తమ జట్టుకు ఆయా నగరాల పేర్లు పెట్టి  అమాయకుల అభిమానాన్ని దోచుకొని వ్యాపారం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసినవారున్నా, తెలియని ఐపీఎల్​ ప్రేక్షకులెందరో ఉండి ఉంటారు కూడా!

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి..పొలిటికల్​ ఎనలిస్ట్​–