
న్యూఢిల్లీ: మన దేశంలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో (జీసీసీలు) 55 శాతం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి. ఈ మూడు సిటీల్లో 922 ఆఫీసులు ఉన్నాయని అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,700 జీసీసీలు టైర్-1, టైర్-2 నగరాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3,200 జీసీసీలలో ఇవి 53 శాతం వాటాకు సమానం. తక్కువ ఖర్చులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మౌలిక సదుపాయాల వల్ల ఇండియాలో వీటి సంఖ్య పెరుగుతోందని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు అన్నారు.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణేలోనే 94 శాతం జీసీసీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. 2027–-28 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలోని మొత్తం జీసీసీల సంఖ్య 2,100 దాటవచ్చని అంచనా. ఏటా 150 కొత్త జీసీసీలు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. ఇండియాలోని మొత్తం జీసీసీలలో దాదాపు 50 శాతం ఐటీ రంగానికి చెందినవి కాగా, బీఎఫ్ఎస్ఐకి 17 శాతం వాటా ఉంది. బెంగళూరులో 487, హైదరాబాద్లో 273, ఢిల్లీలో 272, ముంబైలో 207, పూణేలో 178, చెన్నైలో 162 జీసీసీలు ఉన్నాయి.