- చెలరేగిన వెంకటేశ్, కోహ్లీ, దేవదత్
ధర్మశాల: లీగ్ చివరి దశలో హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్–19లో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ (40 బాల్స్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్), విరాట్ కోహ్లీ (37 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 58), దేవదత్ పడిక్కల్ (25 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 45) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు 23 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచింది.
ఇక వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను మరింత క్లిష్టం చేసుకుంది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 222/4 స్కోరు చేసింది. ఛేజింగ్లో పంజాబ్ 20 ఓవర్లలో 199/8 స్కోరుకే పరిమితమైంది. శశాంక్ సింగ్ (27 బాల్స్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 56) మెరుపులు వృథా అయ్యాయి. వెంకటేశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- ‘టాప్’ లేపారు..
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బెథెల్ (11)ను హర్ప్రీత్ బ్రార్ (2/35) ఔట్ చేసినా.. మిగతా టాపార్డర్ బ్యాటర్లు తలా కొన్ని రన్స్ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో పవర్ప్లేలో ఆర్సీబీ 61/1 స్కోరు చేసింది. సాఫీగా రన్స్ చేస్తున్న ఈ జోడీని 10వ ఓవర్లో హర్ప్రీత్ విడగొట్టాడు. పడిక్కల్ను ఔట్ చేసి రెండో వికెట్కు 76 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించాడు. దాంతో తొలి 10 ఓవర్లలో బెంగళూరు 101/2 స్కోరు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 31 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు.
తర్వాత వచ్చిన వెంకటేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్గుసన్ బౌలింగ్లో లాంగాన్, లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే అవతలి వైపు తొలి ఓవర్లోనే 21 రన్స్ ఇచ్చిన చహల్ (1/42).. కోహ్లీని ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మూడో వికెట్కు 60 రన్స్ జతయ్యాయి. 15 ఓవర్లు ముగిసేసరికి 157/3 స్కోరు చేసిన బెంగళూరుకు చివర్లో టిమ్ డేవిడ్ (28) మెరుపు ముగింపు ఇచ్చాడు. 16, 17 ఓవర్లలో నాలుగు ఫోర్లు కొట్టిన వెంకటేశ్ 29 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ వెంటనే మరో సిక్స్ దంచాడు. 18వ ఓవర్లో ఇద్దరు సిక్స్, ఫోర్తో 13 రన్స్ రాబట్టారు. ఆ తర్వాత డేవిడ్ 6, 4 కొట్టి వెనుదిరిగాడు. చివరి ఐదు ఓవర్లలో 65 రన్స్ వచ్చాయి.
- శశాంక్ పోరాటం వృథా
లక్ష్య ఛేదనలో పంజాబ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ (2/38) తన తొలి రెండు ఓవర్లలో ప్రియాన్షు ఆర్య (0), ప్రభ్సిమ్రన్ సింగ్ (2)ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో రసిక్ సలామ్ (3/36) దెబ్బకు శ్రేయస్ అయ్యర్ (1) వెనుదిరిగాడు. కూపర్ కనోలీ (37), సూర్యాన్ష్ షెడ్జే (35) ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. దాంతో పంజాబ్ 49/3తో పవర్ప్లేను ముగించింది. అయితే 8వ ఓవర్లో షెఫర్డ్ (1/50).. కనోలీని ఔట్ చేయడంతో నాలుగో వికెట్కు 43 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన స్టోయినిస్ (37) గట్టిగానే పోరాడాడు. 11వ ఓవర్లో సూర్యాన్ష్ కూడా ఔట్ కావడంతో పంజాబ్ 93/5తో ఎదురీత మొదలుపెట్టింది.
ఈ టైమ్లో స్టోయినిస్తో కలిసిన శశాంక్ ఆర్సీబీ బౌలింగ్ను దంచికొట్టాడు. దాదాపు ఐదు ఓవర్లు ఈ ఇద్దరు పరుగుల వర్షం కురిపించారు. కానీ 17వ ఓవర్లో హాజిల్వుడ్ (1/36).. స్టోయినిస్ను ఔట్ చేయడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆరో వికెట్కు 67 రన్స్ జతయ్యాయి. ఓ వైపు వికెట్లు పడినా.. రెండో ఎండ్లో బౌండ్రీలు దంచిన శశాంక్ 22 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు. చివరి ఓవర్లో పంజాబ్కు 33 రన్స్ అవసరమైన దశలో రసిక్ సలామ్.. నాలుగు బాల్స్ తేడాలో అజ్మతుల్లా (14), శశాంక్ను ఔట్ చేసి ఆర్సీబీని గెలిపించాడు.
- సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 222/4 (వెంకటేశ్ 73*, కోహ్లీ 58, హర్ప్రీత్ బ్రార్ 2/35).
పంజాబ్: 20 ఓవర్లలో 199/8 (శశాంక్ 56, కనోలీ 37, రసిక్ సలామ్ 3/36).
- ఒకే ఫ్రాంచైజీ తరఫున అత్యధిక రన్స్ (5500) చేసిన తొలి ప్లేయర్ విరాట్ కోహ్లీ. శిఖర్ ధవన్, డేవిడ్ వార్నర్ వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఈ ఫీట్ అందుకున్నారు.
- ఒకే జట్టుపై అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా కోహ్లీ తన రికార్డును బ్రేక్ చేసుకున్నాడు. పంజాబ్పై 1175 రన్స్ చేశాడు. చెన్నైపై 1174 రన్స్ రికార్డును అధిగమించాడు.
- ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ కోహ్లీ (280). రోహిత్ (279) రెండో ప్లేస్లో ఉన్నాడు.
- ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో (9) ఐదు వందలకు పైగా రన్స్ చేసిన తొలి ప్లేయర్ కోహ్లీ. వార్నర్ (7), రాహుల్ (7) తర్వాతి ప్లేస్లో ఉన్నారు.
