
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏప్రిల్ 25న ప్రత్యేకమైన ఖగోళ సన్నివేశం సాక్షాత్కరించనుంది. దీన్నే జీరో షాడో డేగా పిలుస్తారు. ఈ ప్రక్రియలో వస్తువుల నీడ కనిపించదు. మధ్యాహ్నం 12.17 గంటలకు ఇది ప్రారంభం కానుంది. బెంగళూరు కోరమంగళలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సందర్భంగా తమ క్యాంపస్ లో ఈవెంట్లు నిర్వహిస్తోంది. బెంగళూరు వాసులు ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఫొటోలు ట్వీట్ చేస్తున్నారు.
జీరో షాడో డే అంటే...
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, సాధారణంగా సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలో ఉన్నప్పుడు వస్తువు నీడ పడదు. ఈ పరిస్థితి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పడు, జీరో షాడో పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మనిషి నీడ.. వారి కాళ్ల కిందకి వెళ్లిపోతుంది. తలకు కుడి భాగాన పాదాల అంచున కొద్ది నీడ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఎవరి నీడను వారు చూడలేరు. దీన్నే జీరో షాడే డే గా పిలుస్తారు. ఇది ఉష్ణమండలంలో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. ఈ పరిస్థితి కేవలం కొన్ని సెకన్ల పాటే ఉంటుంది. కానీ దాని ప్రభావం నిమిషంపాటు ఉండవచ్చు. ఒడిశాలోని భువనేశ్వర్ లో 2021లో జీరో షాడో డేని జరుపుకున్నారు.