జూమ్ కాల్‌లో ఒకేసారి 900 మందిని జాబ్ నుంచి తీసేసిన సీఈఓ

జూమ్ కాల్‌లో ఒకేసారి 900 మందిని జాబ్ నుంచి తీసేసిన సీఈఓ

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పిల్లల స్కూల్.. మొదలు ఆఫీసు మీటింగ్స్‌ వరకూ చాలా పనులు జూమ్‌ కాల్‌లోనే అయిపోతున్నాయి. కానీ ఇలాంటి ఓ జూమ్‌ కాల్ Better.com కంపెనీకి చెందిన ఉద్యోగులకు జీవిత కాలంలో మర్చిపోలేనిదిగా మిగిలిపోయింది. ఏకంగా కంపెనీ సీఈవోతో  జరిగిన జూమ్‌ మీటింగ్ అది. అందులో సీఈవో చెప్పిన చేదు వార్త విని ఒక్కసారిగా ఉద్యోగుల షాక్ అయ్యారు. అది ప్రొడక్టివిటీ సరిగా లేని, బద్ధకంగా పని చేస్తున్న ఉద్యోగుల తొలగింపు వార్త. అయితే అది ఏ ఐదు, పది మంది ఉద్యోగులపై వేటు కాదు.. ఏకంగా ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగులను తీసేశాక ఏడ్చేశా..

Better.com కంపెనీకి సీఈవో అయిన ఇండియన్ అమెరికన్ విశాల్ గార్గ్ ఇటీవలే ఆయన కంపెనీ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ పెట్టారు. పెర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ ఆధారంగా కొంత మంది ఉద్యోగులకు కాల్‌ షెడ్యూల్ చేశారు. ఆ కాల్ షురూ అయ్యాక సీఈవో విశాల్ మాట్లాడుతూ.. ఇప్పుడు మీకో షాకింగ్ న్యూస్ అన్నారు. ‘‘మీరు ఈ జూమ్‌ కాల్‌లో ఉన్నారంటే.. కంపెనీలోని దురదృష్టవంతుల్లో ఒకరని అర్థం. మిమ్మల్ని తక్షణం ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నాం” అని ప్రకటించారు. మొత్తం మూడు నిమిషాల పాటు సాగిన ఆ కాల్‌లో ఇదొక చాలెంజింగ్ నిర్ణయమని విశాల్ అన్నారు. తన కెరీర్‌‌లో ఇలా చేయడం రెండోసారి అని, అయితే ఇలా ఉద్యోగులను తీసేయడం తనకూ ఇష్టం లేదని, గతంలో ఇలా చేసినప్పడు తాను ఏడ్చేశానని చెప్పారు. అయితే ఈసారి స్ట్రాంగ్‌ నిర్ణయం తీసుకున్నానని, చాలా మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేయడం లేదని, చాలా బద్ధంగా వ్యవహరిస్తున్నారని విశాల్ అన్నారు. అందుకే కంపెనీలోని 15 శాతం ఉద్యోగులను తీసేస్తున్నానని చెప్పారు. ఈ కాల్‌లో ఉన్నవారిలో 250 మంది ఉద్యోగులు ఎనిమిది గంటల షిఫ్ట్‌కు గానూ రెండు గంటలు కూడా పని చేయలేదని విశాల్‌ అన్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

జూమ్‌ కాల్‌లో సీఈవో చెప్పిన మాటలను ఓ ఉద్యోగి తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. లిట్‌క్విడిటీ అనే ట్విట్టర్ హ్యండిల్‌లో దానని పోస్ట్ చేశాడు. అయితే ఉద్యోగులను తీసేసిన సీఈవో విశాల్ గార్గ్ మళ్లీ రిక్రూట్‌మెంట్ కోసం తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో పెట్టిన దానిని స్క్రీన్ షాట్‌ తీసి ఆ ఫొటోను కూడా ట్వీట్ చేశాడు. కాగా, ఆ వీడియోపై Better.com కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఇప్పుడు 15 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఈవో పొరబాటుగా చెప్పారని, నిజానికి తీసేసింది 9 శాతం ఉద్యోగులనేనని క్లారిటీ ఇచ్చారు.