- లీవ్పై వెళ్లాలని కంపెనీ ఆదేశం
న్యూఢిల్లీ: అమెరికన్ కంపెనీ బెటర్ డాట్కామ్ సీఈఓ విశాల్ గార్గ్పై వేటు పడింది. కేవలం మూడు నిమిషాల జూమ్ కాల్ ద్వారా ఏకంగా 900 మంది జాబ్స్ నుంచి తీసేయడం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో కంపెనీ బోర్డు రంగంలోకి దిగింది. వెంటనే సెలవుపై వెళ్లాలని సీఈఓను ఆదేశించింది. కంపెనీలో మంచి పద్ధతులను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఆయన తక్షణమే సెలవుపై వెళ్లిపోతారని తెలిపింది. రోజువారీ పనులను సీఎఫ్ఓ కెవిన్ రయాన్ చూసుకుంటారు. బెటర్ డాట్కామ్ ఆన్లైన్ హౌసింగ్ మోర్టగేజ్ సేవలు అందిస్తుంది. ఈ నెల ఒకటో తేదీన విశాల్ గార్గ్ జూమ్ మీటింగ్లోనే 900 మందిని తీసేశారు. కంపెనీ ఉద్యోగుల్లో 9 శాతం మందిని వెళ్లిపొమ్మనడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రిస్మస్కు ముందు ఇలా చేయడం తప్పని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ‘ఇలాంటి వార్త వినాలని మీరు కోరుకోరని నాకు తెలుసు. ఈ మీటింగులో ఉన్న అందరినీ జాబ్స్ నుంచి తొలగిస్తున్నాం. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది’ అంటూ విశాల్ గార్గ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ జూమ్ కాల్ను కంపెనీ ఎంప్లాయ్ ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంపెనీలోని వివిధ సెగ్మెంట్లలో పనిచేస్తున్న వందలాది మందిని గార్గ్ జాబ్స్ నుంచి తొలగించారు. ఇలా 900 మందిని జాబ్స్ నుంచి తీసేయడం తనకు కూడా కష్టంగా అనిపించిందని, పనితీరు బాగా లేకనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఎంప్లాయీస్ బద్దకస్తులని, వారితో ఎటువంటి ఉపయోగం లేదని వారిని గార్గ్ తరచూ తిడతారని యూఎస్ మీడియా పేర్కొంది. గార్గ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారేమి కాదు. ఎంప్లాయీస్ను విపరీతంగా తిడుతూ గతంలో ఈ–మెయిల్స్ రాశారని ఫోర్బ్స్ పేర్కొంది.