
- చైతన్యపురిలో ఆరుగురు అరెస్ట్
- రూ.14 లక్షలకు పైగా క్యాష్ సీజ్
హైదరాబాద్, వెలుగు: మొబైల్ యాప్స్తో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్ రాచకొండ పోలీసులకు చిక్కింది. ఐసీసీ ట్వంటీ–20 వరల్డ్ కప్ మ్యాచ్ లే టార్గెట్ గా చైతన్యపురి అడ్డాగా బెట్టింగ్ చేస్తున్న ఇద్దరు ఆర్గనైజర్స్, ముగ్గురు పంటర్స్ ను ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 14 లక్షల 92 వేల క్యాష్, ల్యాప్ టాప్, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురిలోని మోహన్ నగర్ కి చెందిన బైరామల్ శ్రీధర్ (36) కోఠిలో బుక్స్టాల్ రన్ చేస్తున్నాడు. ‘క్రికెట్ లైన్ గురు’ , ‘క్రికెట్ ఎక్స్ఛేంజ్’ యాప్లతో ఏడాది కాలంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తన దగ్గర పనిచేసే సంబ్రమ్ ఆంజనేయులు(26)తో కలిసి ఫ్రెండ్స్ గ్రూప్లో కాంటాక్ట్స్ ను పెంచుకున్నాడు. బెట్టింగ్పై ఇంట్రెస్ట్గా ఉన్న పంటర్ల వద్ద రూ.100 నుంచి మొదలుకుని మ్యాచ్, టీమ్ల ప్రకారం రేట్లను ఫిక్స్ చేశాడు. రెగ్యులర్ కస్టమర్స్, బెట్టింగ్పై ఇంట్రెస్ట్ ఉన్న పంటర్స్తో లిస్ట్ ప్రిపేర్ చేసేవాడు. టీమ్స్ పేరుతో బెట్టింగ్ అమౌంట్ వసూలు చేసేవాడు. ఇందుకోసం మోహన్నగర్లోని తన ఇంటిని షెల్టర్గా చేసుకున్నాడు.
ట్వంటీ–20 వరల్డ్ కప్ టార్గెట్గా..
ట్వంటీ–20 వరల్డ్ కప్ మ్యాచ్ లను శ్రీధర్ టార్గెట్ చేశాడు. ఆదివారం జరిగిన ఇండియా– పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, స్కాట్లాండ్ మ్యాచ్ లపై బెట్టింగ్ నిర్వహించాడు. మంగళవారం జరిగిన వెస్టిండిస్–సౌతాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ లపై బెట్టింగ్ కి ప్లాన్ చేశాడు. దీని గురించి సమాచారం అందుకున్న ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు మంగళవారం ఉదయం శ్రీధర్ ఇంటిపై దాడులు చేశారు. అతడిత ఓపాటు రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో సరూర్ నగర్ కామేశ్వరరావు కాలనీకి చెందిన జాజుల రాముగౌడ్(43), గౌని కళ్యాణ్(40), బృంధావన్ కాలనీకి చెందిన బోయిన్పల్లి చత్రపతి(51)ని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.