స్కిల్స్ ట్రైనింగ్కు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు

స్కిల్స్ ట్రైనింగ్కు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు

పది వేల మందికి నైపుణ్య శిక్షణ
ఇక రెగ్యులర్​డిగ్రీతో పాటు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు
రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్
20 ఇంజినీరింగ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక 
ఈ అకడమిక్ ఇయర్ నుంచే అమలు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్,  ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

 పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు జనవరిలోనే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిమాండ్కు అవసరమైన ఉద్యోగాలు కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యామండలి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియం (బీఎఫ్ఎస్​ఐ)తో ఒప్పందం కుదుర్చు కుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన ఈ మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. 

రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటుగానే దీన్ని విద్యార్థులకు నేర్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ కోర్సుగా అందిస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలను బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం తయారు చేసింది. 

ఈ పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్తో పాటు, అర్హులైన వారందరికీ ఇంటర్న్​షిప్​తో పాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రాం రూపొందించారు. 

రాష్ట్రంలో ఈ ఏడాది తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కోర్సులను నిర్వహిస్తుంది. ఈ అకడమిక్ ఇయర్ (2024-–25) నుంచే ఈ కోర్సులను ప్రారంభిస్తున్నది. 

ఈ నెల 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభిస్తారు. 5,000 మంది ఇంజనీరింగ్, 5,000 మంది నాన్ ఇంజనీరింగ్.. మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పిస్తారు. 

అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్​తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవటంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారం ఉండదు. 

డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్ హాన్స్​మెంట్ కోర్సు, జనరిక్ ఎలెక్టివ్స్ పాఠ్యాంశాలను పరిచయం చేస్తారు. ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈక్యూయూఐపీపీపీ అనే సంస్థను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేశారు. 

అటు బీఎఫ్ఎస్ఐ సంస్థలతో అనుసంధానానికి, మరోవైపు ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. తొలి విడతగా ఈ సంస్థ రూ.2.50 కోట్లను అందించేందుకు సిద్ధపడింది. ప్రతి ఏడాది పది వేల మంది విద్యార్థులకు మూడేండ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ ను ఈ సంస్థ సమీకరిస్తుంది.

బీఎఫ్ఎస్ఐకు భారీ డిమాండ్

బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌‌లోని ఐటీ అండ్ ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేండ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. 

బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 

ఈ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించటం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. 

శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పని చేస్తారా.. లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళ్తారా.. అనేది కూడా గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు సవాలుగా మారింది. దీంతో ప్రభుత్వం దీన్ని టేకాఫ్​ చేసి. విద్యార్థులకు ఉపాధి లభించేలా చర్యలకు ఉపక్రమించింది.